ఫస్ట్ టైమ్ సెంటిమెంట్ మరచిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ అయితే అందుకున్నాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఆ సినిమా అభిమానులను సంతృప్తి పరచలేక పోయింది. ఇక తదుపరి సినిమా మాత్రం ఎలాగైనా ఆడియన్స్ కు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవాలనే చూస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడవసారి చేస్తున్న ప్రాజెక్టుపై అయితే మహేష్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అతడు ఖలేజ సినిమాల అనంతరం వీరి కలయికలో రాబోతున్న సినిమా కాబట్టి తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని అభిమానుల్లో కూడా ఒక నమ్మకం అయితే ఉంది. అయితే మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రతి ఏడాది ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఒకరోజు మాత్రం తప్పకుండా ఆడియన్స్ కు మిస్సవ్వకుండా ఏదో ఒక మంచి సర్ ప్రైజ్ అయితే ఇస్తూ ఉంటాడు.

ఆ స్పెషల్ డే ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31వ తేదీన మహేష్ తప్పకుండా ఏదో ఒక సినిమా అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు ఆ డేట్ ను అలా కాళీగా వదిలేశాడు. ఈ ఏడాది తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో అనుకుంటే అసలు చిన్న అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వక పోవడం విశేషం.

అయితే ఒక విధంగా చెప్పాలి అంటే మహేష్ బాబుకు అప్డేట్ ఇవ్వడానికి చాన్స్ కూడా లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ప్రాజెక్టు ఓకే చేయడం తప్పితే మరో అడుగు ముందుకు వేయలేదు. అలాగే రాజమౌళి సినిమా కూడా మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి రెండు ప్రాజెక్టుల విషయంలో మహేష్ బాబు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరి రాబోయే రోజుల్లో మహేష్ అభిమానులను ఎలా హ్యాపీ చేస్తాడో చూడాలి.