పైసా వ‌సూల్‌కు కొత్త టార్గెట్ ఇచ్చేశారు

శాత‌క‌ర్ణి స‌క్సెస్ త‌ర్వాత బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం  పైసా వ‌సూల్‌. ద‌ర్శ‌కుడు పూరీ తీసిన ఈ చిత్ర ఆడియో వేడుక‌లు తాజాగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి  వ‌చ్చిన మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. పైసా వ‌సూల్‌కు కొత్త టార్గెట్ ఇచ్చేశారు. పూరీ స్టైల్లోకి మారిన బాల‌య్య‌తో ఈ చిత్రంపై ఇప్ప‌టికే ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌పంచం గ‌ర్వించే మ‌హాన‌టుడు.. అన్న‌య్య ఎన్టీఆర్ అని.. ఆయ‌న కుమారుడు బాల‌య్య ఎంతో ప్రేమ‌గా.. అప్యాయంగా పిల‌వ‌టంతో తాను చెన్నై వెళ్లాల్సి ఉన్నా ఇంటి ఫంక్ష‌న్ కావ‌టంతో తానీ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు మోహ‌న్ బాబు. బాల‌కృష్ణ చ‌రిత్ర సృష్టించార‌ని.. సిల్వ‌ర్ జూబ్లీ.. గోల్డెన్ జూబ్లీ రికార్డుల్ని క్రియేట్ చేశార‌ని ఇది నిజ‌మ‌న్నారు. డ‌బ్బులు ఇచ్చి బాల‌య్య సినిమాలు ఆడించ‌లేద‌న్న వ్యాఖ్య‌లు చేసిన మోహ‌న్ బాబు..  పైసా వ‌సూల్ చిత్రం 101 కోట్ల కంటే ఎక్కువ క‌లెక్ష‌న్ సాధించాల‌న్నారు.

బాల‌య్య 101 చిత్రమైన పైసా వ‌సూల్.. రూ.101 కోట్ల కంటే ఎక్కువ క‌లెక్ష‌న్లు సొంతం చేసుకోవాల‌న్న మోహ‌న్ బాబు ఆకాంక్ష బాల‌య్య అభిమానుల‌కు కొత్త బాధ్య‌త‌గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.

బాల‌య్య‌తో సినిమా తీయాల‌న్న త‌న కోరిక  పైసా వ‌సూల్ తో తీరింద‌ని.. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు తీసే ఛాన్స్ ఇస్తార‌ని ఆశిస్తున్న‌ట్లుగా చిత్ర నిర్మాత పేర్కొన్నారు. సెప్టెంబ‌రు 1న పూరీ పండ‌గ‌ను తీసుకొస్తున్నార‌ని.. బాల‌య్య 101 చిత్ర విడుద‌ల సంద‌ర్భంగా ఆయ‌న అభిమానుల్లో 101 మంది మెరిట్ స్టూడెంట్స్ కు రూ.10వేలు చొప్పున అంద‌చేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

త‌న లైఫ్ లో.. లైట్ పోతుంది.. త్వ‌ర‌గా షాట్ తీద్దాం రండంటూ అంద‌ర్నీ పిలిచి కెమెరా ముందుకు వెళ్లి నిల‌బ‌డిన ఏకైక హీరో బాల‌య్య అన్న ద‌ర్శ‌కులు పూరీ.. ప్రొడ్యూస‌ర్ డ‌బ్బు వృధా కాకూడ‌ద‌ని ఫీల‌య్యే వ్య‌క్తి బాల‌కృష్ణ అని అన్నారు. ఇలాంటి హీరోను తానిప్ప‌టివ‌ర‌కూ చూడ‌లేద‌న్నారు. బాల‌కృష్ణ క్ర‌మ‌శిక్ష‌ణ‌.. అంకిత‌భావం గ‌తంలో మోహ‌న్ బాబులో చూశాన‌ని చెప్పారు పూరీ.