షూటింగ్ దశలోనే భారీ ధరకు అమ్ముడైన నిఖిల్ సినిమా రైట్స్..?

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘కార్తికేయ’. ఇప్పుడు వీరి కలయికలో ఈ చిత్రానికి సీక్వెల్ గా ”కార్తికేయ 2” రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

‘కార్తికేయ 2’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అనౌన్స్ మెంట్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. అప్పుడప్పుడు చిత్ర యూనిట్ షూటింగ్ విశేషాలు వెల్లడిస్తూ వచ్చింది. ఫస్ట్ లుక్ – టీజర్ వంటివి రిలీజ్ అవకుండానే.. ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషల శాటిలైట్ రైట్స్ మరియు ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కలిపి రూ. 20 కోట్లకు విక్రయించారట.

‘కార్తికేయ’ సినిమా ఘన విజయం సాధించడం.. ‘కార్తికేయ 2’ మూవీపై ఉన్న బజ్ కారణంగానే ఈ సినిమా రైట్స్ షూటింగ్ దశలోనే ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. కాగా నిఖిల్ – చందు మొండేటి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఇది నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. ఫస్ట్ పార్ట్ కి మించి వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటాయని.. డైరెక్టర్ చందు మొండేటి నెక్స్ట్ లెవల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్ – ఉత్తరాఖండ్ – హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ – రాజస్థాన్ లలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. రాబోయే షెడ్యూల్ ని యూరప్ లోని గ్రీస్ మరియు ఆగ్నేయాసియా దేశమైన వియత్నాం లలో ప్లాన్ చేసినట్లు సమాచారం.

”కార్తికేయ 2” చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – వివేక్ కూచిభోట్ల సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.