పరశురామ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి..??

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన పరశురామ్ పెట్లా.. ‘యువత’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మంచి కథకుడిగా పేరు తెచ్చుకున్న పరశురాం.. ‘సోలో’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘గీత గోవిందం’ వంటి విజయాలు అందుకున్నారు. అయితే స్టార్ హీరోలని డీల్ చేయడంలో మాత్రం దర్శకుడు తడబడుతున్నారనే చర్చ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో నడుస్తోంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంజనేయులు’ ‘సారొచ్చారు’ వంటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రెండింటిలో మెయిన్ ఫ్లాట్ బాగానే రవితేజ లాంటి స్టార్ ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లనే ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో వర్క్ చేసే అవకాశం అందుకున్నాడు.

మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా పరశురాం డైరెక్ట్ చేసిన ”సర్కారు వారి పాట” సినిమా ఇటీవలే భారీ స్థాయిలో విడుదలైంది. అయితే ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రెజెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద మంచి పాయింట్ రాసుకున్నా.. మహేశ్ లాంటి స్టార్ ని డీల్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడనే కామెంట్స్ వచ్చాయి.

ఆర్ధిక నేరగాళ్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొడితే.. అది లోన్లు తీసుకున్న సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ‘సర్కారు వారి పాట’ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. స్టోరీ లైన్ గా చెప్పుకోడానికి బాగున్నా.. దర్శకుడు ఆ పాయింట్ కి సరైన న్యాయం చేయలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రథమార్థమంతా అసలు పాయింట్ తో సంబంధం లేకుండా లవ్ ట్రాక్ మరియు కామెడీతో నడిపించి.. ద్వితీయార్థంలో మెయిన్ పాయింట్ ను చెప్పాలనే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు పరశురాం. కానీ దానికి తగ్గట్టుగా సన్నివేశాలు రాసుకోకుండా.. కేవలం డైలాగులతో నడిపించేశాడనే విమర్శలు వస్తున్నాయి.

మహేష్ బాబు ని సరికొత్తగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. దీనికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ. కానీ ఓవరాల్ సినిమా విషయానికొస్తే ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. ఇప్పుడు సర్కారు వారికి వస్తున్న వసూళ్ళు కూడా కేవలం మహేశ్ బాబు స్టార్ పవర్ వల్లనే వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తం మీద పరశురాం మంచి లైన్ రాసుకున్నా. స్టార్ హీరోని డీల్ చేయడంలో మరోసారి ఫెయిల్ అయ్యారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ గీతా కాంపౌండ్ లోకి వెళ్తారా? అనే డిస్కషన్ మొదలైంది. అయితే పరశురాం తన తదుపరి చిత్రాన్ని యవసామ్రాట్ నాగచైతన్య తో చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

నిజానికి ఈ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట కంటే ముందే ఉండాల్సింది. కానీ మహేశ్ నుంచి పిలుపు రావడంతో చైతూ సినిమాని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మరి దర్శకుడికి ఈ చిత్రం ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.