మెగా మామా అల్లుళ్ళ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..?

‘వకీల్ సాబ్’ అనే రీమేక్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇటీవల ‘భీమ్లా నాయక్’ వంటి మలయాళ రీమేక్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ క్రమంలో పవన్ ఇప్పుడు మరో రీమేక్ కి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కలిసి నటించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమా రీమేక్ లో మామా అల్లుళ్ళు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే ఫిలిం సర్కిల్స్ లో లేటెస్టుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మార్చి 24న ఈ రీమేక్ చిత్రాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

ఈ రీమేక్ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించాడని టాక్. ఇందుకుగాను 50 కోట్ల ఫుల్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తన షూటింగ్ పార్ట్ ను వీలైనంత త్వరగా ముగించాలనే షరతు కూడా పెట్టారట పవన్.

యాదృచ్ఛికంగా సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తేజ్.. మళ్లీ సెట్స్ పైకి రావడం ఇదే తొలిసారి అవుతుంది. దీంతో తన మేనమామతో కలిసి నటించాలనే డ్రీమ్ కూడా నెరవేర్చుకోబోతున్నారు.

కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదయ సీతమ్’ మూవీ ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సముద్ర ఖనే తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్ లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగం కానున్నారని టాక్. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడానికి రెడీ అయ్యారట. తెలుగులో స్టార్ హీరో ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారట.

జీ5 సహకారంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న పవన్.. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ ని స్టార్ట్ చేయడానికి ముందే ఈ రీమేక్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే అవకాశం ఉంది. పవన్-తేజ్ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.