RRR: ‘చిరంజీవి స్థాయి చెప్పి.. కొందరికి చురకలంటించి..’ రాజమౌళి ప్రసంగం

‘చిరంజీవి గారికి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నచ్చదు.. ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడమే ఇష్టం. కానీ.. నేను మాత్రం చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను’ అని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చిరంజీవి గురించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

‘పది నెలలుగా ఏపీ గవర్న్ మెంట్ రిలీజ్ చేసిన జీవో కరెక్ట్ కాదని.. మాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పడానికి ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది. నేనూ ప్రయత్నం చేశాను. కానీ.. ఎవరమూ ముందుకు వెళ్లలేక పోయాం. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని.. రెండు, మూడుసార్లు ఆయన్ను కలిసి.. సమస్యను వివరించి కొత్త జీవో రావడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన్ను చాలా మంది చాలా మాటలు అన్నారు. రకరకాల మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారు. చిరంజీవి గారూ.. యూ ఆర్ ఏ ట్రూ మెగాస్టార్. చాలామందికి తెలీదు.. తెలంగాణ ప్రభుత్వం ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారే కారణం. ఆయన తెర వెనుక ఉండి నడిపించి అంతా చేశారు. మళ్లీ చెప్తున్నా.. చిరంజీవి గారికి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నచ్చదు.. ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడమే ఇష్టం. కానీ.. నేను మాత్రం చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారికి రుణపడి ఉండాలి’ అని అన్నారు.

రాజమౌళి ప్రసంగం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై చిరంజీవి రెండుసార్లు తాడేపల్లి వచ్చి సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవితోపాటు మహేశ్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ.. వంటి ప్రముఖులు వచ్చి మాట్లాడి వెళ్లారు. ఇటివలే రాజమౌళి, నిర్మాత దానయ్య కూడా సీఎంను కలిసి వెళ్లారు. దీంతో ఏపీలో టికెట్ల పెంపుపై ఏపీ జీఓ ఇచ్చిన సంగతి తెలిసిందే.