థర్డ్ వేవ్ పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎంతో మందికి తన చేతనైన సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అయ్యారు.. ఇప్పటికీ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఆయన చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అందుకే వారు చేసే మంచి పనుల్లో సోనూసూద్ కు కూడా భాగస్వామ్యం ఇస్తున్నారు.

ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి చేపట్టిన “దేశ్ కే మెంటర్” అనే మంచి కార్యక్రమానికి సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ ను చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని చెప్పే సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకుంటాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. అయితే ఈ మధ్య సోనూ సూద్ ను ఒక వ్యక్తి కరోనా థర్డ్ వేవ్ పై మీరు ఎలా అనుకుంటున్నారు.. థర్డ్ వేవ్ వస్తుందని మీరు కూడా భావిస్తున్నారా అని అడగ్గా ఆ విషయాంపై ఇప్పుడు సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ప్రెసెంట్ థర్డ్ వేవ్ ను అనుభవిస్తున్నామని ఆయన అన్నారు. పేదరికం నిరుద్యోగం కంటే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ కాదు అని ఆయన కామెంట్స్ చేసారు. ఇది పోవాలంటే అందరు ముందుకు వచ్చి నిరు పేదలకు సహాయం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ ఆయన తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే .. మనదేశంలో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు తాజాగా మళ్లీ పెరుగుతూ పోతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 509 మంది కరోనా మహమ్మారి బాధితులు ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 35181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32857937కు చేరుకోగా రికవరీ కేసులు 32028825కి పెరిగాయి. ఇక కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 439529 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 389583 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని. గత 24 గంటల్లో 8109244 డోసుల వ్యాక్సిన్ వేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 663037334 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించింది.