
రాజకీయాల్లో జరిగే ఆసక్తికరమైన పరిణామాలకు ఇదో నిదర్శనం. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన రాజకీయ ముందడుగు ఇప్పుడు మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీల దోస్తీని దెబ్బతీసే స్థాయికి చేరింది. దీనికి పరోక్ష కారణం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాగా…ప్రత్యక్ష కారణం మాత్రం వైఎస్ జగన్! ఇదంతా ఏపీలో జంప్ జిలానీల గురించి. వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం గురించి!
వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మందికి విజయవంతంగా తన పార్టీ కండువా కప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతరం కొద్దికాలానికి కేబినెట్ విస్తరణ ద్వారా అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై జగన్ ఆండ్ టీం గగ్గోలు పెట్టినా బాబు లైట్ తీసుకున్నారు. దీంతో జగన్… ఢిల్లీ వేదికగా చంద్రబాబును ఇరకాటంలో పడేసేందుకు సిద్ధమయ్యారు. హస్తినాకు వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సహా కేంద్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టిన యవ్వారాన్ని వెల్లడించారు. అయితే దీనిపై బాబు మండిపడ్డారు. అసలు వైఎస్ జగన్కు ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసి చాలామంది యువత బీజేపీలో చేరారని, అలాగే ఇక్కడ తనను చూసి చాలామంది టీడీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు.
ఈ పరిణామంపైనే బీజేపీ ఏపీ నేతలు గుర్రుమంటున్నారు. ఇతర పార్టీల నేతలను జంప్ చేయించి మంత్రి పదవి ఇచ్చిన బాబుకు మిత్రపక్షంగా తాము ఇప్పటికే విమర్శల పాలు అవుతుంటే ఇంకా రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కేబినెట్ మంత్రికి సమానమైన ప్రధాన ప్రతిపక్ష నేతకు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటారని బీజేపీ నేతలు ధర్మ సందేహం లేవనెత్తుతున్నారు. అసలు బాబు చేసిందే రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయమైతే….తమ నేతలపై గుస్సా అవడం ఎందుకుని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరే నేతలకు జంప్ జిలానీలకు మంత్రి పదవి ఇవ్వడడం ఒక్కటే ఎలా అవుతుందని తప్పుపడుతున్నారు. బాబు కామెంట్లను త్వరలోనే ఢిల్లీ పెద్దలకు చేరవేయనున్నట్లు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా జగన్ వేసిన అడుగు ఏకకాలంలో బీజేపీ, టీడీపీల మధ్య అసంతృప్తి రాజేసేందుకు కారణమయిందనే మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది.
Recent Random Post: