సర్కారు వారి పాట… థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అల వైకుంఠపురం లో సినిమా కు పాటలు అద్భుతంగా అందించి రికార్డు స్థాయి విజయాన్ని ఆ సినిమా సొంతం చేసుకోవడం లో సంగీత దర్శకుడు థమన్ ముఖ్య పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. అల వైకుంఠపురం సినిమా సక్సెస్ లో కీలక పాత్ర థమన్ దే అంటూ స్వయంగా అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు థమన్ సర్కారు వారి పాట సినిమా పై అదే స్థాయి అంచనాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కరోనాకు కొన్ని రోజుల ముందు 2020 సంవత్సరం సంక్రాంతి కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

మళ్లీ ఇన్నాళ్లకు ఆయన నుండి సర్కారు వారి పాట రాబోతుంది. కరోనా వల్ల చాలా ఆలస్యం అయిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. తాజాగా చిత్ర సంగీత దర్శకుడు థమన్ మీడియా ముందుకు వచ్చాడు. సర్కారు వారి పాట తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. సూపర్ హిట్ అవుతుందనే వ్యాఖ్యలు చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సమయంలో అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం అనేది పెద్ద ఛాలెంజ్. ఈ సినిమా కోసం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ రెండేళ్లు గా ఎదురు చూస్తున్నారు. కనుక అంచనాలు మరింతగా పెరుగుతాయి. కనుక ఛాలెంజ్ మరింత కఠినంగా మారుతుంది. అయినా కూడా ఈ సినిమా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని థమన్ అభిమానులకు హామీ ఇచ్చాడు.

సాదారణంగా సినిమాల విడుదల సమయంలో ఇలాంటి స్టేట్మెంట్స్ కామన్ గా చూస్తూనే ఉంటాం. థమన్ వ్యాఖ్యలు మాత్రం సినిమా పై మరింతగా ఆసక్తిని పెంచుతున్నట్లుగా ఉన్నాయంటూ మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే థమన్ నుండి వచ్చిన పాటలు సినిమా స్థాయిని పెంచాయి. మహేష్ బాబు స్థాయికి తగ్గట్లుగా పాటలు ఉన్నాయంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.