విజయ్ దేవరకొండ ‘AVD సినిమాస్’ ప్రారంభం..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా రాణించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘రౌడీ’ అనే బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ వ్యాపారంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ‘ఏవీడీ సినిమాస్’ (ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్) అనే మల్టీప్లెక్స్ ను నిర్మించారు.

ప్రపంచ స్థాయి సినిమా అనుభవం అందించే ‘ఏవీడీ సినిమాస్’ మల్టీప్లెక్స్ ను ఈరోజు బుధవారం మహబూబ్ నగర్ లో లాంఛనంగా ప్రారంభించారు. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ – నారాయణదాస్ నారంగ్ – భరత్ నారంగ్ – విజయ్ తండ్రి దేవరకొండ గోవర్ధన్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా షూటింగ్ కోసం గోవా లో ఉండటంతో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి రాలేకపోయారు.

మహబూబ్ నగర్ లోని తిరుమల థియేటర్ స్థానంలో ‘AVD సినిమాస్’ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. అక్కినేని నాగచైతన్య – శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లవ్ స్టోరీ’ సినిమాతో సెప్టెంబర్ 24న ఈ థియేటర్ తెరవబడుతుంది. ఏషియన్ సినిమాస్ వారు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘AMB సినిమాస్’ – అల్లు అర్జున్ తో ‘AAA సినిమాస్’ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ భాగస్వామ్యంలో ‘AVD సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభించారు.

ఇకపోతే ‘ఏవీడీ సినిమాస్’ మల్టీప్లెక్స్ గురించి తెలియజేస్తూ విజయ్ దేవరకొండ ఇటీవల స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ”నటుడిగా మిమ్మల్ని అలరించిన నేను ఇప్పుడు మీకు మరింత వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ ప్రారంభించాను. నా తల్లిదండ్రుల సొంతూరైన మహబూబ్ నగర్ లో నా మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఇది. నాగచైతన్య – నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్ స్టొరీ’ సినిమాతో ‘ఏవీడీ’ ప్రారంభం కానుంది. నా కెరీర్ శేఖర్ కమ్ముల గారి వద్ద మొదలైంది. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాతోనే ఏవీడీ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి ఉండాలనుకున్నాను. కానీ గోవాలో ‘లైగర్’ కోసం బిజీగా ఉండటం వల్ల అక్కడికి రాలేకపోతున్నా. ఇది నా జీవితంలో చాలా గొప్ప విషయం” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.