ఏపీలో రగులుతున్న పరిణామాలు.. ఏం జరుగుతుంది?

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రభుత్వ పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీలు కత్తులు నూరుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు జరిగిన దానికి మించి జరుగుతుందనే భావన రాజకీ య వర్గాల్లో వ్యక్తమవుతోంది. మాదక ద్రవ్యాలకు అడ్డాగా ఏపీ మారుతోందని.. మాట్లాడిన.. టీడీపీ నాయకు డు.. పట్టాభిఈ క్రమంలో నోరు జారిన ఏకైక పదం కారణంగా.. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీ ఎత్తున రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోటాపోటీ.. నిరసనలు పోటా పోటీ దీక్షలు జరిగాయి. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుక్కున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ పరిణామాలు.. సమసిపోలేదు. రాష్ట్రపరిధి దాటి.. కేంద్రం వరకు పాకుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్ర సంగతులు వివరించి.. జగన్ను ఇరికించాలని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా చూడాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే.. బాబు దూకుడుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. బాబుకంటే.. ముందుగానే కేంద్రం వద్ద.. పంచాయతీ పెట్టి.. ఇక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నాలు చేయాలని.. వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఏపీ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింతగా రగలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. విశాఖలో పర్యటించి.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిన సీఎం జగన్.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనికి కారణం.. టీడీపీ అధినేతకు ఢిల్లీలో రాష్ట్రపతి అప్పాయింట్మెంట్ను ఖరారు చేయడమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడి ద్వారా మైలేజీ పొందాలని టీడీపీ ప్రయత్నిస్తే.. దీనిని అడ్డుకుని తీరాలన్నట్టుగా వైసీపీ వ్యవహరించింది. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు జరిగింది.

అయితే.. ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లోనూ ఈ విషయాన్ని తీసుకువెళ్లి.. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. సానుభూతి పొందాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు.. వైసీపీ ప్రతిగా కౌంటర్ సిద్ధం చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం బాబుకన్నా కూడా వైసీపీకే బీజేపీ నేతల దగ్గర అవకాశం ఉంది. అటు ప్రధాని.. కేంద్ర హోం మంత్రి సహా.. అనేక మందితో వైసీపీకి రాజకీయ సంబంధాలు ఉన్నాయని అంటారు. సో.. ఈ కారణంగా.. చంద్రబాబు ఢిల్లీలో చేసే అన్ని ప్రయత్నాలకు తాము కూడా కౌంటర్ ఇవ్వాలని.. వైసీపీ నాయకులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ వ్యూహాల నేపథ్యంలో తాను కూడా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైజాగ్ టూర్ ను కూడా జగన్ రద్దు చేసుకున్నారు. ఇందుకు గల కారణాల్ని కూడా సీఎంవో వెల్లడించలేదు. అలాగే ఈ నెల 28న కేబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో .జగన్ అడుగులు ఆసక్తిరేపేలా ఉన్నాయి. మరి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో.. ఏవిధంగా కేంద్రం దగ్గర తన పరిస్థితిని వివరించి.. నమ్మిస్తారో.. చూడాలని అంటున్నారు పరిశీలకులు.

ఇక ఈ నెల 28న జగన్ కేబినెట్ మీట్ నిర్వహించనున్నారు. అయితే.. తర్వలోనే మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీనే ఆఖరుదా? అనే చర్చ జరుగుతుండడం గమనార్హం.ఇదిలావుంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలో మరింత అగ్రెసివ్ గా ముందుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. దీంతో కేబినెట్ సమావేశంలోనే కేబినెట్ ప్రక్షాళన..పార్టీ బాధ్యతలు… 2024 ఎలక్షన్ మిషన్.. ప్రస్తుతం ప్రజలతో మమేకం పైనా సీఎం దిశా నిర్దేశం చేసేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలనేపధ్యంతో తాజాగా జరగబోయే కేబినెట్కు ప్రాధాన్యం ఏర్పడింది.