ఆచార్య? ‘మెగా’ కమ్యూనికేషన్ గ్యాప్?

ఎన్నాళ్ల నుంచో మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా ఆచార్య. కంటిన్యూగా హిట్ లు మాత్రమే కాకుండా మంచి సినిమాలు అందిస్తారు అని పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా. ఈ సినిమా ఇప్పటికి కొంత వరకు పూర్తయింది. ఇంకా చాలా అంటే చాలా వర్క్ అయితే బకాయి వుంది. హీరోయిన్ సీన్ లోకి రావాలి. రామ్ చరణ్ పార్ట్ వుండనే వుంది.

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివకు, మెగాస్టార్ కు మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కాస్త పెద్ద కథే వుందని తెలుస్తోంది. సినిమాలో వున్న యంగ్ హీరో క్యారెక్టర్ నే దీనికి కేంద్రం కావడం విశేషం.

ముందుగా ఈ క్యారెక్టర్ కు రామ్ చరణ్ ను అనుకున్నారు. కానీ సినిమా విడుదలకు ఆటకం కలుగుతోందని తెలిసినపుడు మహేష్ నుతీసుకుందాం అనుకున్నారు. ఇక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎలా అంటే, మెగాస్టార్ కు చెప్పకుండానే, మహేష్ ను కొరటాల శివ సంప్రదించినట్లు బోగట్టా. ఇలా ఎందుకు చేసారు అంటే అసలు మహేష్ కు ఆసక్తి వుందో లేదో తెలియకుండా, మెగాస్టార్ కు ఆయనను తీసుకుందాం అని చెప్పి, తీరా మహేష్ కనుక చేయను అంటే, ఈయన హర్డ్ అవుతారు కదా? అందుకే అటు వెర్షన్ కనుక్కుని ఇటు చెబుదాం అని కొరటాల శివ అనుకున్నట్లు తెలుస్తోంది.

కానీ తమకు ముందుగా చెప్పకుండానే కొరటాల నిర్ణయం తీసుకుని, మహేష్ ను సంప్రదించేసారు అని మెగాస్టార్ ఫీల్ అయినట్లు బోగట్టా. మహేష్ పేరు మీడియాలోకి వచ్చేసి, ఆ తరువాత మళ్లీ కాదని, ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ కావడం సరికాదని మెగాస్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరక్టర్ కు, మెగాస్టార్ కు మధ్య మరీ విబేధాలు వచ్చేయలేదు కానీ, కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.