రామ్ – లింగుస్వామి సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి

రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నాయిక. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రమిది. జాతీయ అవార్డ్ గ్రహీత లింగుస్వామి ఈ సినిమాతో రామ్ లో మరో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. తాజాగా ఆది పినిశెట్టిని విలన్ గాఎంపిక చేసారు.

ఆది పినిశెట్టి తెలుగు-తమిళంలో పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. అతడు ఇంతకుముందు రామ్ చరణ్ `రంగస్థలం` చిత్రంలో చరణ్ కి సోదరుడి పాత్రలో నటించి మెప్పించారు. మంచు లక్ష్మి- తాప్సీ గుండెల్లో గోదారి చిత్రంలోనూ మత్స్యకారుడి పాత్రలో చక్కని నటనతో మెప్పించారు. అంతకుముందు పలు అనువాద చిత్రాలతో తెలుగు ఆడియెన్ ని మెప్పించారు. ఇక ఇటీవల హీరోగా నటిస్తూనే వరుసగా ప్రయోగాలకు రెడీ అవుతున్నారు.

సరైనోడు తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో అవకాశం దక్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

నార్మల్ రోల్ కాదు:

దర్శకుడు వినిపించిన కథ విన్నాను. స్క్రిప్టు చదివాక వారం తీసుకున్నా.. సరైనోడు తర్వాత మళ్లీ విలన్ గా చేయాలంటే పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఇది విన్నాక నార్మల్ గా ఉండే రోల్ కాదనిపించింది. విలన్ కి ఈ మూవీలో చిన్నప్పటి నుంచి ట్రావెల్ ఉంటుంది. అతడు ఎందుకు అలా ఉన్నాడు..? అనే డీటెయిలింగ్ నాకు బాగా నచ్చింది. మామూలుగా సినిమాల్లో విలన్ పాత్రకు డీటెయిలింగ్ ఉండదు. ఇందులో అది ఉంది.

కడప .. మధురై బేస్డ్:

ఈ రోల్ కడప కర్నూల్ కి చెందిన రా అండ్ రస్టిక్ రోల్.. తమిళంలో మధురై బేస్ లో ఉంటుంది. సరైనోడులో స్టైలిష్ విలన్ గా చేశాక.. ఇందులో మళ్లీ విలన్ పాత్ర ఇంటరెస్టింగ్ గా అనిపించింది. ప్యారలల్ గా నా సినిమాలు నేను చేస్తూ డిఫరెంట్ షేడ్ ని ఇందులో చూపించవచ్చు.

నన్ను నేను విస్తరించుకునేందుకు:

`యూటర్న్` నిర్మాతలతో నాకు ఇది రెండో సినిమా. లింగుస్వామి గారు బలమైన విలన్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించనున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఈ సినిమాలో చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవకాశాలు నటుడిగా నన్ను నేను విస్తరించడానికి అవకాశం అనుకుంటున్నాను.. షూటింగ్ కోసం వేచి చూస్తున్నాను అని ఇంటర్వ్యూ ముగించారు.

ఆ ముగ్గురికి మరో మలుపు:

పందెం కోడి సహా తమిళంలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్ని తెరకెక్కించిన లింగుస్వామి ప్రస్తుతం రామ్ తో మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ పోతినేని ఇమేజ్ అమాంతం మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇందులో కథానాయికగా నటిస్తున్న కృతి శెట్టి స్టార్ హీరోయిన్ రేంజుకు చేరుతుందని భావిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టికి ఇది మరో మలుపు కానుంది.