ఆగడు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట పై అంచనాలు భారీగా ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో వేసిన భారీ బ్యాంక్ సెట్టింగ్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు సర్కారు వారి పాట లో సీరియస్ మెసేజ్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుందని అంటున్నారు. సినిమాలోని పోసాని కృష్ణ మురళి కామెడీ సన్నివేశాలతో పాటు మహేష్ బాబు పాత్ర కూడా కామెడీ యాంగిల్ లో సాగుతుందని టాక్.

మహేష్ బాబు దూకుడు సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొంది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అతే తరహాలో ఆగడు సినిమాలో కూడా మహేష్ బాబు కామెడీ పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాని సినిమా ఫలితం రివర్స్ అయ్యింది. దాంతో మళ్లీ మహేష్ బాబు పూర్తి స్థాయి కామెడీ పాత్ర పై దృష్టి పెట్టలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కాస్త కామెడీ యాంగిల్ ను చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించినా కూడా కథ సీరియస్ గా సాగడం వల్ల ట్రైన్ ఎపిసోడ్ వరకే కామెడీ సీన్స్ ఉన్నాయి.

ఇక మహేష్ బాబు ఆగడు సినిమా తర్వాత పూర్తి స్థాయిలో కామెడీ యాంగిల్ లో కనిపించబోతున్న సినిమా సర్కారు వారి పాట అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత సమయంలో అభిమానులు కమర్షియల్ సినిమాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. మంచి కామెడీ మరియు కథ కథనం ఆకట్టుకునే విధంగా ఉంటే భారీ విజయాలను దక్కించుకుంటున్న సినిమాలు ఈమద్య చాలానే చూస్తున్నాం. అందుకే సర్కారు వారి పాట సినిమాను కూడా కామెడీ స్క్రీన్ ప్లేతో నడిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సర్కారు వారి పాట సినిమా లో మహేష్ బాబు పాత్ర ఏంటీ అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాని ఆయన పాత్ర చాలా వినోదాత్మకంగా ఉంటుందని మాత్రం తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ గత చిత్రం సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున ఈ సినిమా ను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తు ఉండగా సీనియర్ నటుడు ఒకరు ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

గీత గోవిందం వంటి హిట్ సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కనుక ఇది ఆయనకు తప్పకుండా మరో విజయాన్ని కట్టబెడుతుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట సినిమా గురించి సోషల్ మీడియాతో పాటు అన్ని ప్లాట్ ఫామ్ ల మీద కూడా చర్చ జరుగుతూనే ఉంది. వచ్చే సంక్రాంతి వరకు ఈ సినిమా గురించి ఎన్నెన్ని వార్తలు వినాల్సి వస్తుందో..!