#MEGA154 అప్డేట్: తీరాన్ని తాకనున్న మెగా వేవ్..!


మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో పాటుగా మరో మూడు ప్రాజెక్ట్స్ లోనే లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) తో చేయబోతున్న సినిమా కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిరు నటిస్తున్న ఈ 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

రేపు (ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా #MEGA154 ప్రాజెక్ట్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై టైడ్ హెచ్చరిక అంటూ ఓ పోస్టర్ ద్వారా రేపు సాయంత్రం 4:05 గంటలకు మెగా వేవ్ తీరాన్ని తాకుతుందని వెల్లడించారు. ఈ మెగా పోస్టర్ మీకు కచ్చితంగా గూస్ బంప్స్ ఇస్తుందని తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మా వైపు నుండి ఇచ్చే మెగా గిఫ్ట్ ఇదని దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో సముద్ర తీరాన ఓ పడవ మీద యాంకర్ వేలాడుతూ ఉండగా.. అందులో దూరంగా మెగాస్టార్ షాడో ఇమేజ్ కనిపిస్తోంది. ఇది చూస్తుంటే వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన సినిమాలా అనిపిస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ”వాల్తేర్ వీరయ్య” టైటిల్ ను ఖరారు చేసారేమో అనే సందేహాలు కలిగిస్తోంది. #MEGA154 చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు రేపు వెళ్లాడయ్యే అవకాశం ఉంది.

కాగా ‘పవర్’ ‘జైలవకుశ’ ‘వెంకీమామ’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ.. చిరంజీవితో ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమా ఇది. దీని తర్వాతే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళమ్’ రీమేక్ రూపొందనుంది. ఏదేమైనా చిరు బర్త్ డే స్పెషల్ గా వరుస అప్డేట్స్ వస్తుండటం మెగా అభిమానుల్లో జోష్ నింపింది. మరికొన్ని గంటల్లో రాబోయే మెగా వేవ్ ఎలా ఉంటుందో చూడాలి.