తప్పు కదా.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ‘శవ పుత్రుడు’ అనొచ్చా.?

మళ్ళీ మళ్ళీ అదే పాత సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా తగలడ్డాయ్.! తమలపాకుతో సుతిమెత్తగా నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో బుర్ర బద్దలయ్యేలా నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదే పదే ‘సీబీఎన్ దత్త పుత్రుడు..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రెండు చోట్లా ఓడిపోయిన దత్త పుత్రుడు..’ అనీ, ఇంకోటనీ.. పవన్ కళ్యాణ్‌ని ఎగతాళి చేయడమే రాజకీయంగా తన లక్ష్యం.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదు.. రాజధాని అసలే అవసరం లేదు.. అభివృద్ధి ఊసే లేదు. కానీ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం ద్వారా ‘తుత్తి’ పొందాలి. ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత లక్ష్యం. ఔను, గత కొద్దిరోజులుగా వైఎస్ జగన్ ఇంతలా ‘దత్తపుత్రుడు’ అని చెలరేగిపోయి విమర్శలు చేస్తున్నారంటే, ఆ పవన్ కళ్యాణ్‌ని చూసి ఆయనెంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఆ పవన్ కళ్యాణ్ కొట్టబోయే రాజకీయ దెబ్బ నుంచి తనను రక్షించమని ప్రజల్ని వైఎస్ జగన్ దేబిరించుకుంటున్నట్టుంది పరిస్థితి.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇదిలా వుంటే, పదే పదే దత్త పుత్రుడంటూ పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలపై న్యాయవాది, ఒకప్పటి జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ వీడియో ద్వారా స్పందించారు.

తన తండ్రి పార్తీవ దేహాన్ని పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేసిన ఘన చరిత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదనీ, ఆ సమయంలో వైఎస్ జగన్ కంట కన్నీరు కనిపించలేదనీ ఎద్దేవా చేశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ఆ పార్తీవ దేహం సాక్షిగా రాజకీయాలు చేసి, ‘ముఖ్యమంత్రి పదవి కోసం’ పాకులాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శవ పుత్రుడు అంటే తప్పెలా అవుతుందని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించడం గమనార్హం.

ఇప్పుడీ ‘శవ పుత్రుడు’ అంశం సోషల్ మీడియాలో ట్రెండిగ్ అయి కూర్చుంది. జనసేనకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణేమో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిన బెయిల్ రెడ్డి.. జైలు రెడ్డి.. అంటున్నారాయె.! దత్త పుత్రుడనే కామెంట్ కంటే, దారుణమైన కామెంట్లు కదా ఇవి.? అయినా, ముఖ్యమంత్రిని శవ పుత్రుడనడం సబబు కాదేమో.!