నన్ను ఎక్కువగా భయపెట్టేది అదే: కంగనా రనౌత్

Share


బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ తన స్పష్టమైన అభిప్రాయాలు, నిర్భయమైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సినిమా విషయమైనా, సామాజిక అంశమైనా, రాజకీయ అంశమైనా తన మనసులో ఉన్నదాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం ఆమె ప్రత్యేకత. భయం, బెదురు అనే పదాలు తన వ్యక్తిత్వానికి దూరమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా తనలో కూడా సాధారణ మనుషుల్లాగే భయాలు, సందేహాలు ఉంటాయని అంగీకరించారు. ముఖ్యంగా నటిగా విజయవంతమైన కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తనలో కొన్ని కొత్త ఆలోచనలు, ఆందోళనలు మొదలయ్యాయని వెల్లడించారు.

“మీకు భయం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా?” అనే ప్రశ్నకు స్పందించిన కంగనా, భయం అనేది ఎప్పుడూ పెద్ద సంఘటనల వల్లే రావాల్సిన అవసరం లేదని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సందేహాలే మనల్ని ఎక్కువగా కలవరపెడతాయని చెప్పారు.

ప్రజాప్రతినిధిగా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో “నేను ఈ పదవికి పూర్తిగా న్యాయం చేయగలుగుతున్నానా? ప్రజల కోసం సరైన విధంగా పనిచేస్తున్నానా?” అనే ప్రశ్నలు తనను తరచూ ఆలోచనలో పడేస్తుంటాయని తెలిపారు. ఈ విషయంలో కొన్నిసార్లు ఆందోళన కూడా కలుగుతుందని చెప్పారు.

గ్లామర్ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన రూపురేఖల విషయంలో కూడా కొత్త సందేహాలు ఎదురవుతున్నాయని కంగనా పేర్కొన్నారు. “నేను ఇంకా హీరోయిన్‌లా కనిపిస్తున్నానా? లేక రాజకీయ నాయకురాలిగా మరీ ఎక్కువగా అలంకరించుకుంటున్నానా? ఒకవేళ స్లీవ్‌లెస్ దుస్తులు ధరిస్తే ప్రజలు నన్ను ఎలా అర్థం చేసుకుంటారు?” వంటి ఆలోచనలు అప్పుడప్పుడు మనసులోకి వస్తాయని వెల్లడించారు.

కొత్త రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఇలాంటి అనిశ్చితి, ఆత్మపరిశీలన సహజమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల ద్వారా కంగనా తన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం కంగనా సినిమాలు, రాజకీయ బాధ్యతలను సమాంతరంగా నిర్వహిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో కామా అండ్ ఆల్బ్లెస్ ఆసుపత్రిలో పనిచేసిన వైద్య సిబ్బంది, నర్సులు, వార్డ్ బాయ్స్ ప్రదర్శించిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాలో కంగనా ఓ నర్సు పాత్రలో కనిపించనున్నారు. సాధారణ ఉద్యోగుల అసాధారణ ధైర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశభక్తి, మానవత్వం, త్యాగస్ఫూర్తిని ప్రతిబింబించే ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుందని కంగనా ఆశాభావం వ్యక్తం చేశారు. మనోజ్ తపాడియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


Recent Random Post: