బోల్డ్ సీన్స్‌పై కాజల్ క్లారిటీ

Share


చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భర్త గౌతమ్ కిచ్లూ, కుమారుడు నీల్‌తో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే, కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ విడుదలకు సిద్ధమవుతుండగా, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తాజా ఇంటర్వ్యూలో ఆన్‌స్క్రీన్ గ్లామర్, బోల్డ్ సన్నివేశాలపై స్పందించిన కాజల్.. బికినీ లేదా అత్యంత సన్నిహిత సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. అలాంటి విషయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటిని వెండితెరపై ప్రదర్శించడం తన వ్యక్తిగత నమ్మకాలకు విరుద్ధమని చెప్పారు.

ఎంత పెద్ద సినిమా అవకాశం వచ్చినా, ఎంతటి స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినా తన వ్యక్తిగత హద్దులను దాటబోనని కాజల్ స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉన్నానని, అవకాశాల కోసం లేదా క్రేజ్ కోసం వాటిని ఎప్పుడూ మార్చుకోలేదని వెల్లడించారు.

టాలీవుడ్‌లో దశాబ్దానికి పైగా అగ్ర కథానాయికగా కొనసాగిన కాజల్, స్టార్ హీరోల సరసన ఎన్నో కమర్షియల్ విజయాలు అందుకున్నప్పటికీ, తనకు నచ్చిన పరిమితుల్లోనే గ్లామర్‌ను ప్రదర్శించారు. పెళ్లి తర్వాత, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలపై ఆమె స్పష్టమైన అభిప్రాయానికి అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో దేశాభివృద్ధిపై కూడా కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం ఆరోగ్యంగా, అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వాలను లేదా ఇతరులను విమర్శించడం సరిపోదని, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించాలని ఆమె అన్నారు. నీటిని ఆదా చేయడం, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, పరిశుభ్రతను పాటించడం వంటి చిన్న చిన్న అలవాట్లే సమాజంలో పెద్ద మార్పుకు దారితీస్తాయని పేర్కొన్నారు.

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషించగా, కాజల్ పవర్‌ఫుల్ అడ్వకేట్ అర్చన పాత్రలో కనిపించనున్నారు. వ్యవసాయంలో పురుగుమందుల అధిక వినియోగం, ఆహార కల్తీలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామా, సమాజంలో ఆహార భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై చర్చకు దారితీసే ప్రయత్నం చేస్తుందని చిత్రబృందం భావిస్తోంది.


Recent Random Post: