
సైబర్ నేరగాళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేదు. అవకాశం దొరికితే ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు సైతం సైబర్ క్రైమ్ బాధితులుగా మారిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సీ కుటుంబం కూడా చేరింది.
ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సీ ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. కెరీర్ మంచి దశలో ఉండగానే కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్న అతడికి తాజాగా సైబర్ మోసం రూపంలో పెద్ద షాక్ తగిలింది.
ఇటీవల విక్రాంత్ మాస్సీ కుటుంబం సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా విక్రాంత్ వెల్లడించాడు. సైబర్ ముఠాలు తమ కుటుంబాన్ని టార్గెట్ చేశాయని, ఈ ఘటన తమను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని ఆయన తెలిపాడు.
ఈ మోసంలో భాగంగా విక్రాంత్ భార్య శీతల్ ఠాకూర్ బ్యాంక్ ఖాతా నుంచి రెండు విడతల్లో డబ్బు అక్రమంగా విత్డ్రా అయినట్లు వెల్లడించాడు. గుర్తు తెలియని వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఈ మోసానికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నాడు.
ఘటన జరిగిన వెంటనే విక్రాంత్ మాస్సీ కుటుంబ సభ్యులు అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బ్యాంకు అధికారులను కూడా సంప్రదించి అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
సెలబ్రిటీలపై ఇలాంటి డిజిటల్ దాడులు పెరుగుతుండటం నెటిజన్లలో ఆందోళన కలిగిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని భావించిన సమయంలో విక్రాంత్కు ఈ ఘటన ఊహించని షాక్గా మారింది.
కాగా, సైబర్ మోసాల బారిన పడిన వారిలో సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి లక్షల రూపాయలు కాజేసిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అలాగే కత్రినా కైఫ్, అఫ్తాబ్ శివదాసాని, రాజ్కుమార్ రావు వంటి పలువురు బాలీవుడ్ నటులు కూడా నకిలీ కేవైసీ లింకులు, క్రెడిట్ కార్డ్ మోసాల కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొని పోలీసులను ఆశ్రయించారు.
Recent Random Post:















