కియరాతో ప్రేమలో ఫెయిలైన పాపం పసోడు!

వ్యాపారవేత్తలతో రియాలిటీ షో మొదటి సీజన్ `షార్క్ ట్యాంక్ ఇండియా` భారీ విజయాన్ని సాధించింది. భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకుడు .. మేనేజింగ్ డైరెక్టర్.. అష్నీర్ గ్రోవర్ ఈ విజయం వెనక కారకుడు. 2 జనవరి 2023న షార్క్ ట్యాంక్ ఇండియా రెండవ సీజన్ విడుదలైన తర్వాత వీక్షకులను అష్నీర్ ప్రదర్శన ఆశించినంత ఆకట్టుకోలేదు. దీనితో పాటు కార్ దేఖో వ్యవస్థాపకుడు అమిత్ జైన్ కూడా అతని స్థానంలో ప్రదర్శనలో విఫలమయ్యాడు.

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 అంతగా సానుకూల సమీక్షలను అందుకోకపోయినా అష్నీర్ గ్రోవర్ తన పుస్తకమైన `డోగ్లాపన్: ది హార్డ్ ట్రూత్ ఎబౌట్ లైఫ్ అండ్ స్టార్ట్-అప్` లో తన గురించి సంతోషంగా ప్రచారం చేసుకున్నాడు. ఈ పుస్తకం వ్యాపార వ్యవస్థాపక వ్యవహారాలు … బిజినెస్ లోతుపాతుల గురించి చాలా అద్భుతమైన సలహాలతో ఆసక్తిని కలిగించింది. ఇది మాత్రమే కాదు.. అష్నీర్ పుస్తకం జీవితం గురించి జీవితంలోని కఠినమైన సత్యాల గురించి బయటకు తెలియని చాలా విషయాలను వెల్లడించింది.

అయితే పుస్తకంలో ఒక సంఘటన చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ నటి కియారా అద్వానీ వల్ల తాను దాదాపు భార్య మాధురీ జైన్ గ్రోవర్ నుండి విడాకులు తీసుకునే వరకూ వెళ్లిందని వెల్లడించారు. అవును! ఇది నిజంగా జరిగిన కథ. ఆ రోజు ఏం జరిగింది అంటే..?

అష్నీర్ గ్రోవర్ -డోగ్లాపన్ పుస్తకంలో `కియారా అద్వానీ ఆల్మోస్ట్ గాట్ మి డైవోర్స్ ` అనే శీర్షికతో ఒక అధ్యాయం ఉంది. దీనిలో అష్నీర్ కొన్ని సంవత్సరాల క్రితం తన భార్య కుటుంబంతో ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగిన తమాషా సంఘటనను గుర్తుచేసుకున్నాడు. అష్నీర్ తన ఆఫీస్ కార్యకలాపాలు సమావేశాల పనులతో చాలా బిజీగా ఉన్నందున ఒక రోజు తన తల్లి తనను పిలిచి నువ్వు `బిగ్ షాట్` అయ్యానని తనతో చెప్పినట్లు షార్క్ ట్యాంక్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అదే రోజు ఉదయం అష్నీర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్ ఒక పెళ్లిళ్ల పేరమ్మ కం స్నేహితురాలితో మాట్లాడుతూ అతడి గత వివాహ ప్రణాళికల గురించి అడిగారట.

ఆమె మాధురీ జైన్ కి స్నేహితురాలు.. అష్నీర్ గ్రోవర్ కు కూడా పరిచయస్తురాలు. ఆమె ప్రముఖ మ్యాచ్ మేకర్. పేరు సిమా తపారియా.. సిమా ఆంటీ అని కూడా పిలుస్తారు. హైప్రొఫైల్స్ కి మ్యాచ్ మేకర్ గా కొనసాగుతోంది. అయితే అష్నీర్ కి సీమా ఆంటీ బోలెడన్ని హై ప్రొఫైల్స్ ని చూపించింది. కానీ అవేవీ నచ్చకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్ ని మీరే ఎంచుకోండి అని అష్నీర్ ని కోరారు సీమా. అయితే ఈ పేర్లలో కియరా అద్వాణీ పేరును అతడు సజెస్ట్ చేశాడట. ఈ విషయం తెలిశాక మరుసటి రోజు అలిగిన మాధురి తనతో మాట్లాడలేదు.

విమాన ప్రయాణంలో మీద పడి కొట్టినంత పని చేసిందట. తన భార్యతో విడాకులు అయ్యేంత కాంప్లికేషన్ వచ్చి పడిందని అష్నీర్ ఛమత్కరించాడు. కియరా అద్వాణీ అందానికి అంతగా పడి చచ్చానని సదరు ఎంటర్ ప్రెన్యూర్ చెప్పకనే చెప్పాడు. నేటి సాయంత్రం కియరా అద్వాణీ తన ప్రేమికుడు సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడి జీవితంలో సెటిలవుతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రాని ఘాడంగా ప్రేమించి బ్రేకప్ అయిన ఆలియా భట్ ఇటీవలే రణబీర్ కపూర్ ని పెళ్లాడిన స్టోరీ తెలిసినదే.