
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిస్ వెనిజులా ఆండ్రీ డెల్ వాల్పై ఆమె వ్యక్తిగత సెలబ్రిటీ స్టైలిస్ట్ జియోవన్నీ లగునా కత్తెరతో దాడి చేసిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. గ్లామర్ ప్రపంచానికి ప్రతీకగా నిలిచే కేన్స్ వేదికపై ఇలాంటి ఘటన జరగడం అందరినీ షాక్కు గురిచేస్తోంది.
ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆండ్రీ డెల్ వాల్ అక్కడికి వెళ్లారు. రెడ్ కార్పెట్ ఈవెంట్కు సిద్ధమవుతూ హోటల్ గదిలో మేకప్, స్టైలింగ్ చేసుకుంటున్న సమయంలో ఆమెకు స్టైలిస్ట్ జియోవన్నీ లగునాతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వివాదం ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చడంతో, కోపోద్రిక్తుడైన లగునా చేతిలో ఉన్న కత్తెరతో ఆండ్రీ ముఖంపై దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఆమెపై భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో ఆండ్రీ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
దాడి అనంతరం రక్తపు గాయాలతో ఉన్న తన వీడియోను ఆండ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఇక ఈ దాడికి పాల్పడిన జియోవన్నీ లగునా సాధారణ వ్యక్తి కాదని తెలుస్తోంది. లాటిన్ అమెరికాలో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్గా అతనికి మంచి గుర్తింపు ఉంది. పలువురు స్టార్ హీరోయిన్లు, మోడల్స్తో కలిసి పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడటం ఫ్యాషన్ వర్గాలను షాక్కు గురిచేస్తోంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫ్రెంచ్ పోలీసులు వెంటనే స్పందించి హోటల్కు చేరుకుని జియోవన్నీ లగునాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘర్షణకు అసలు కారణాలేమిటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్లామర్ వేదికపై మెరవాల్సిన ఒక మోడల్ రక్తపు గాయాలతో కనిపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన సెలబ్రిటీల భద్రత, ముఖ్యంగా ప్రైవేట్ స్టైలింగ్ రూమ్స్లో సెక్యూరిటీ వ్యవస్థలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Recent Random Post:















