
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) పేరు గత కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం, సింగర్ కెనీషాతో ఆయన సన్నిహిత సంబంధాలపై వచ్చిన వార్తలు ఇంకా చర్చనీయాంశంగానే ఉండగా, ఇప్పుడు మరో కొత్త వివాదం ఆయన చుట్టూ తిరుగుతోంది.
తాజాగా జయం రవి చెన్నైలోని తన నివాసంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు, ఓ మైనర్ బాలుడిని అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. సమాచారం ప్రకారం, ఇటీవల ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందిపైనే అనుమానం వ్యక్తం చేసి వారిని ఇంట్లోనే నిర్బంధించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, వారిలో ఒక మహిళ భర్త తన భార్య ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన భార్యతో పాటు మరో మహిళ, మైనర్ బాలుడిని జయం రవి ఇంట్లో బలవంతంగా ఉంచారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని బయటకు తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, ఏదైనా అనుమానం లేదా చోరీ జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు జయం రవి లేదా ఆయన బృందం అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, జయం రవి వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఆర్తితో ఆయన విడాకుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో సింగర్ కెనీషాతో ఆయన సన్నిహితంగా కనిపించడం, ఇద్దరూ కలిసి ఆస్తి కొనుగోలు చేశారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పటికే పలు వివాదాల మధ్య ఉన్న జయం రవిపై తాజాగా వచ్చిన ఈ ఆరోపణలు తమిళ సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ అంశంపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















