
స్టార్ హీరోల పారితోషికాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే మారుతుంటాయి. సినిమా బడ్జెట్లతో సమానంగా పెరుగుతున్న రెమ్యునరేషన్లు ఇప్పుడు వందల కోట్ల మైలురాళ్లను దాటేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఒకే ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా రూ.325 కోట్ల భారీ మొత్తాన్ని అందుకుని భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందిన నటుడిగా నిలిచినట్లు సమాచారం. దీంతో ఆయన నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీలోని అగ్ర స్టార్లందరి రికార్డులను అధిగమించినట్లయింది.
రణవీర్ సింగ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ధురంధర్ ఘన విజయం ఈ రికార్డు స్థాయి రెమ్యునరేషన్కు ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు భాగాలుగా విడుదలైన ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. భారత్లోనే సుమారు 1900 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ప్రాజెక్ట్లో రణవీర్ సింగ్ ముందస్తు ఫీజు తీసుకోకుండా లాభాల్లో వాటా విధానాన్ని ఎంచుకోవడం విశేషం. అంతేకాకుండా షూటింగ్ సమయంలో బడ్జెట్ పెరిగినప్పుడు ఆయన వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం. ఈ వ్యూహాత్మక నిర్ణయం కారణంగా సినిమా విజయం అనంతరం ఆయనకు లాభాల్లో భారీ వాటా దక్కినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
థియేట్రికల్ షేర్లు, బాక్సాఫీస్ బోనస్లతో పాటు డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల వంటి నాన్-థియేట్రికల్ ఆదాయాలను కలిపి చూసినప్పుడు రణవీర్ వాటా రూ.325 కోట్లకు చేరినట్లు అంచనా. ఈ భారీ విజయంతో నిర్మాణ సంస్థలు, ఇతర భాగస్వాములు కూడా లాభాలు పొందినా, నటుడిగా రణవీర్ అందుకున్న మొత్తం చరిత్రాత్మకంగా నిలిచింది.
ఈ నంబర్తో ఆయన ఇండస్ట్రీలోని టాప్ స్టార్ల రికార్డులను అధిగమించినట్లు చెబుతున్నారు. గతంలో రజనీకాంత్ జైలర్కు సుమారు రూ.250 కోట్లకు పైగా అందుకున్నట్లు, అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 AD చిత్రాలకు రూ.200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు ట్రేడ్ అంచనాలు ఉన్నాయి. అలాగే షారుఖ్ ఖాన్ కూడా పఠాన్, జవాన్ సినిమాల ద్వారా భారీ పారితోషికాలు అందుకున్నారు. ఈ అందరినీ దాటి రణవీర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Recent Random Post:















