“వారి కళ్లు చల్లబడ్డాయా?”.. జానకిపై సుశీల ఆవేదన

Share


భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన అపూర్వమైన గానంతో దశాబ్దాల పాటు అలరించిన గానకోకిల ఎస్. జానకి ఇక లేరనే వార్త సంగీతాభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆమె మరణం తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తుండగా, ప్రముఖ గాయని పి. సుశీల చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన పి. సుశీల, జానకితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో తమ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన వారిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా నా గురించి జానకికి, జానకి గురించి నాకు అబద్ధాలు చెప్పి మా మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారు. మమ్మల్ని మానసికంగా ఎంతో బాధ పెట్టారు. ఇప్పుడు జానకి లేరు… మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వారి కళ్లు చల్లబడ్డాయా?” అంటూ సుశీల భావోద్వేగంగా ప్రశ్నించారు.

అలాంటి ప్రచారాల వల్ల తాము మానసికంగా ఎంతో వేదన అనుభవించామని ఆమె చెప్పారు. జానకితో తన బంధం ఎంతో ప్రత్యేకమైందని, దాన్ని కొందరు దెబ్బతీయాలని ప్రయత్నించడం బాధాకరమని పేర్కొన్నారు.

జానకి గాన ప్రతిభను స్మరించుకుంటూ సుశీల మాట్లాడుతూ, “జానకి లాంటి గాయని మళ్లీ పుట్టరు. చిన్నపిల్లల గొంతు నుంచి వృద్ధుల స్వరం వరకు, మహిళలు, పురుషులు… ఎలాంటి వాయిస్‌నైనా అద్భుతంగా పలికించగల అసాధారణ ప్రతిభ ఆమెది. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె పక్కన నేను ఒక ఉత్సవ విగ్రహంలాంటిదాన్ని మాత్రమే” అని అన్నారు.

జానకి మరణాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, కన్నీళ్లు కూడా రావడం లేదని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. “సరస్వతి దేవి స్వయంగా ఆమెను తన దగ్గరకు పిలిచి ఉండాలి. ఇక అక్కడ కూడా ఆమె గానామృతాన్ని ఆస్వాదించాలని దేవి కోరుకుని ఉంటారు. జానకి తన జీవితంలో సాధించాల్సిందంతా సాధించింది. ఆమె జీవితం పరిపూర్ణమైనది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

పి. సుశీల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జానకితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె వ్యక్తం చేసిన భావోద్వేగం సంగీతాభిమానులను కదిలిస్తోంది.


Recent Random Post: