శంకర్ సర్.. ఎందుకిలా?

శంకర్.. స్టార్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ఈయన అందరికీ సుపరిచితమే. ఇప్పటికే ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు,స్నేహితుడు, బాయ్స్, రోబో, శివాజీ, భారతీయుడు, ప్రేమిస్తే వంటి ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్.. మరోవైపు కమల్ హాసన్ తో ఇండియన్ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల విలక్షణ నటుడు కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఇండియన్-2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుందని చెప్పారు. ఇండియన్-3 కూడా షూటింగ్ పూర్తయిందని చెప్పి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఇండియన్-2 విడుదలైన తర్వాత ఇండియన్-3 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతామని కూడా తెలిపారు. మరో వైపు, ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇటీవల వైజాగ్ లో కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పుడు శంకర్ వర్క్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది

శంకర్ ప్రస్తుతం మూడు పడవలపై ప్రయాణం చేస్తున్నారన్నమాట. అంటే ఒకేసారి మూడు ప్రాజెక్టులపై వర్క్ చేస్తున్నారు. మొత్తం మూడు చిత్రాలు సోషియో పొలిటికల్ థ్రిల్లర్సే. ఒకప్పుడు ఇలాంటి జోనర్ లో శంకర్ తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రోజుల్లో ఇలాంటి చిత్రాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నట్లు కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

మంచి స్క్రీన్ ప్లే, స్టోరీతో తెరకెక్కిస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మూవీలు క్లిక్ అవ్వడం కష్టమేనని అంటున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ తెరకెక్కిస్తున్న మూడు చిత్రాలు.. ఒకే జోనర్ లో వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ మూవీలు.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సాధిస్తాయో చూడాలని అంటున్నారు. ప్రస్తుత జనరేషన్ సినీ ప్రియులు.. శంకర్ కొత్త చిత్రాలను ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.