సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ క్లారిటీ

Share


ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోని సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా సెలబ్రిటీలు ప్రత్యేక కంటెంట్ అందిస్తూ ఆదాయం పొందడం ట్రెండ్‌గా మారింది. అయితే యాంకర్ విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ చుట్టూ నెలకొన్న వివాదం తర్వాత, అభిమానుల్లో ఈ ఫీచర్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఛానెల్ గురించి ముందుగానే స్పష్టమైన వివరణ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

తన సబ్‌స్క్రైబర్ ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ ఉంటుందనే విషయంపై అభిమానుల నుంచి అనేక సందేశాలు వస్తున్నాయని తెలిపిన పాయల్, దీనిపై ఎలాంటి అపోహలకు తావులేకుండా క్లారిటీ ఇచ్చింది. “అసభ్యకరమైన కంటెంట్ లేదా హాట్ ఫొటోలు ఆశిస్తూ ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే, ఈ ఛానెల్ మీ కోసం కాదు” అంటూ ఆమె నేరుగా చెప్పింది.

అదే సమయంలో తన ఛానెల్ అసలు ఉద్దేశం ఏమిటో కూడా వివరించింది. సినిమా షూటింగ్‌ల వెనుక జరిగే ఆసక్తికరమైన విషయాలు, తన వ్యక్తిగత జీవనశైలి, సహజమైన వ్యక్తిత్వం, అభిమానులతో ప్రత్యేక సంభాషణలు వంటి కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తన వ్యక్తిగత హద్దులను గౌరవిస్తూ అండగా నిలిచే అభిమానులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కూడా “ఇది నా నిజమైన, అన్‌ఫిల్టర్డ్ లైఫ్‌ను పంచుకునే స్పేస్ మాత్రమే. అంతకుమించి ఎలాంటి కంటెంట్ ఉండదు” అని పాయల్ మరోసారి స్పష్టం చేసింది.

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్, ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘జిన్నా’, ‘మాయపేటిక’ వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ‘మంగళవారం’ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆమె ‘కిరాతక’ చిత్రంలో నటిస్తుండగా, మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

డబ్బుల కోసం కంటెంట్ స్వరూపాన్ని మార్చకుండా, ముందుగానే తన సబ్‌స్క్రిప్షన్ ఛానెల్‌పై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించడం పట్ల సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పాయల్ రాజ్‌పుత్‌ను అభినందిస్తున్నారు.


Recent Random Post: