
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్లో అత్యంత ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో ‘జై భీమ్’ ఒకటి. సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
సూర్య హీరోగా, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్కు సూర్యతో ఇది తొలి చిత్రం కావడం విశేషం. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు సమాచారం.
కథకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచిన మేకర్స్.. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూనే కమర్షియల్ అంశాలతో కూడిన పవర్ఫుల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. ‘జై భీమ్’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో కథ ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో కథానాయికగా యువ నటి కయాదు లోహర్ ఎంపికైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమెకు పెరుగుతున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని ఇచ్చినట్లు సమాచారం. సంగీత బాధ్యతలను యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బలమైన సాంకేతిక బృందంతో ఈ ప్రాజెక్ట్ రూపొందనున్నట్లు సమాచారం.
ఇటీవల రజనీకాంత్తో ‘వేట్టయాన్’ తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్.. ఇప్పుడు మరోసారి సూర్యతో జతకట్టడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సామాజిక స్పృహతో కూడిన కథలను కమర్షియల్గా చెప్పడంలో జ్ఞానవేల్కు ఉన్న ప్రత్యేక శైలి ఈ చిత్రంలో కూడా కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ‘జై భీమ్’ మ్యాజిక్ను ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేస్తుందా అన్న ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Recent Random Post:















