పంతం నెగ్గించుకున్న విశాల్ – కార్తీ

టాలీవుడ్ లో జరిగిన ‘మా’ ఎలక్షన్స్ ఏ స్థాయిలో వివాదాస్పదంగా మారాయో అందరికి తెలిసిందే. అంతకు మించిన వివాదంగా తమిళ కళాకారుల సంఘం ఎన్నికలు ప్రహసనంగా మారాయి. దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు గత మూడేళ్ల క్రితం జరిగిన విషయం తెలిసిందే. 2019లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఒకే ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాజర్ అధ్యక్షుడిగా విశాల్ ప్రధాన కార్యదర్శిగా హీరో కార్తి కోశాధికారికగా పోటీ చేశారు.

మరో ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా భాగ్యరాజా ప్రధాన కార్యదర్శిగా గణేషన్ పోటీ పడ్డారు. ఎలక్షన్ ముగిసింది. అయితే ఈ ఎలక్షన్ లో విశాల్ అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై ఫిర్యాదు చేశారు అపోజిట్ ప్యానెల్ వారు. మద్రాస్ కోర్టు లో ఫిర్యాదు చేయడంతో కోర్టు కౌంటింగ్ ని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరిపారు.

ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ బలపరిచిన నాజర్ రెండవ సారి అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా హీరో విశాల్ కోశాధికారికగా హీరో కార్తీ గెలుపొందారు. విశాల్ పై అతను బలపరిచిన వ్యక్తులపై తమిళ ఇండస్ట్రీలో కొంత మంది వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అంతే కాకుండా విశాల్ ఓ తెలుగు వాడంటూ అతను నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేయడం ఏంటి? అని చాలా మంది తమిళ దర్శకులు నటులు విమర్శలు గుప్పించారు.

దీంతో నడిగర్ సంఘం ఎన్నికలు ఇరు వర్గాల మధ్య హోరా హోరీగా జరిగాయి. విశాల్ పై ఇదే సమయంలో దర్శకులు భాగ్యరాజా భారతీరాజా రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తీవ్రంగా వ్యతిరేకించారు. అతను తమిళుగడు కాదని నడిగర్ సంఘానికి నేతృత్వం వహించకూడదని తీవ్రంగా విభేధించారు.

ఎన్నికల అనంతరం భాగ్యరాజా ప్యానెల్ మెంబర్స్ ఫలితాలని నిలిపివేయాలంటూ చెన్నై హై కోర్టుని ఆశ్రయించారు. దీంతో గత మూడేళ్లుగా ఎన్నికల ఫలితాలని హోల్డ్ లో పెట్టారు. తాజాగా ఫలితాలు వెలువడటంతో విశాల్ వర్గం హర్షం వ్యక్తం చేసింది.

నాజర్ సహా పలువును విజయం సాధించడానికి ప్రధాన కారణం నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణంతో పాటు పలు విప్లవాత్మక సంస్కరణలకు విశాల్ శ్రీకారం చుట్టడం వాటిని తమిళ నటుల్లో అత్యధిక వర్గం బలంగా నమ్మడం వల్లే విశాల్ తో పాటు ఆయన బలపరిచిన నాజర్ అధ్యక్షుడిగా గెలుపొందారు.