ప్రభాస్ విషయంలో అవన్నీ నిజం కాదు: కృతి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా ”ఆదిపురుష్” అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే.. సీత పాత్రలో కృతి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. అయితే తాజాగా ‘దోచేయ్’ బ్యూటీ కృతి ‘ఆదిపురుష్’ లో తన పాత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.

‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ తో కలిసి నటించాను. ఆయనతో షూటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మా జంట తెరపై చాలా బాగుంటుంది అని కృతి సనన్ తెలిపింది. ఈ సందర్భంగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ”ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అందరితో చాలా సరదాగా ఉంటారు. వినయం ఎక్కువ. భోజన ప్రియుడు కూడా. అయితే అందరూ ఆయనకు బిడియం ఎక్కువ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒక్కసారి కంఫర్ట్బుల్ గా ఫీల్ అయితే.. ప్రభాస్ ఎంతో ఫ్రీగా బాగా మాట్లాడుతారు. అతనితో స్నేహం నాకు ఎంతో నచ్చింది” అని కృతి పేర్కొంది.

ప్రభాస్ తో ఇప్పుడు మరో షెడ్యూల్ చేయబోతున్నట్లు కృతి వెల్లడించారు. ‘ఆదిపురుష్’ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం కోసం ముంబైలోని ఓ స్టూడియోలో నాలుగు రోజుల పాటు ప్రభాస్ – కృతి డ్యాన్స్ రిహార్సల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తైన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తో తలపడబోయే లంకేశ్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. లక్ష్మణుడిగా యువ హీరో సన్నీ సింగ్.. మరో కీ రోల్ లో సీనియర్ నటి కాజోల్ నటిస్తున్నారని సమాచారం.

కాగా ‘ఆదిపురుష్’ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ చేస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాచెత్ తాండన్ – పరంపరా ఠాకూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇది ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా. 2022 ఆగస్టు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.