ప్రాణం పోయినా న్యాయమే గెలవాలని చెప్తున్న అల్లరి నరేష్ ‘బ్రీత్ ఆఫ్ నాంది’


టాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో తనదైన శైలిలో నవ్వులు పంచిన హీరో అల్లరి నరేష్.. తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ”నాంది’’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన ‘నాంది’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి ఇన్ని సంవత్సరాలు పడుతోంది’ అంటూ ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ టీజర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘బ్రీత్ ఆఫ్ నాంది’ విడుదల చేయబడింది.

‘బ్రీత్ ఆఫ్ నాంది’ టీజర్ లో ”15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే కానీ మనదేశానికి స్వాతంత్య్రం రాలేదు. 1300 మందికి పైగా బలిదానం చేసుకుంటే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి” అంటూ అల్లరి నరేష్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో అల్లరి నరేష్ కాళ్ళు చేతులు కట్టివేయబడి నగ్నంగా ఓ ఐరన్ పోల్ పై పడుకొని కనిపిస్తున్నాడు. ఖైదీగా జైలులో అడుగుపెట్టిన నరేష్ ని అక్కడ చిత్ర హింసలు పెడుతున్నట్లు అర్థం అవుతోంది. మొత్తం మీద అల్లరి నరేష్ తనలోని మరో యాంగిల్ ని ఈ చిత్రంలో చూపిస్తున్నాడు. ‘బ్రీత్ ఆఫ్ నాంది’ టీజర్ కి తగినట్లు శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందించాడు. అలానే సిద్ జే అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు.

కాగా ‘నాంది’ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ – నవమి – హరీష్ ఉత్తమన్ – ప్రియదర్శి – ప్రవీణ్ – దేవి ప్రసాద్ – వినయ్ వర్మ – నర్సింహారావు – శ్రీకాంత్ అయ్యంగార్ – రమేష్ రెడ్డి – చక్రపాణి – మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయగా.. రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు. ఇటీవలే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వినూత్నమైన కథ కథనాలతో రూపొందిన ‘నాంది’ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.