అమిత్ షా కనిపించడంలేదు: ఎన్ఎస్ యూఐ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనిపించడంలేదంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ యూఐ) ఫిర్యాదు చేసింది. ఆయన జాడ తెలియడంలేదంటూ ‘అమిత్ షా మిస్సింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్వీట్లతో హోరెత్తించింది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే హోంమంత్రి మిస్సింగ్ అంటూ ట్వీట్లు చేశారు. అంతకుముందు ఎన్ఎస్ యూఐ కార్యదర్శి కరియప్ప ఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశారు.

కరోనా మహమ్మారి గుప్పిట్లో దేశం చిక్కుకుందని, ప్రజలు సంక్షోభంలో ఉన్నారని, ఇలాంటి తరుణంలో అమిత్ షా కనిపించకుండా పోయారంటూ కరియప్ప పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలి కానీ, సంక్షోభ పరిస్థితుల్లో పలాయనం చిత్తగించకూడదని పేర్కొన్నారు. రాజకీయ నేతలు జవాబుదారీతనంతో ఉండాలని, ఆ జవాబుదారీతనం కేవలం భారత ప్రభుత్వానికి, బీజేపీకి మాత్రమే కాదని.. దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేశారు.

చివరిసారిగా అమిత్ షా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించారని కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నారు.