ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్ల లంచం.. ఎన్సీబీపై సాక్షి సంచలనం

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతడు ఎప్పుడు విడుదల అవుతాడన్నది మాత్రం అంతుబట్టడం లేదు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో సంచలన ఆరోపణ తెరపైకి వచ్చింది. క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ రైడ్ కేసులో సాక్షిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) కి దొరికిన వ్యక్తి ఇప్పుడు బాంబు పేల్చాడు. ఎన్సీబీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ను విడుదల చేయడానికి బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ నుంచి రూ.25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు సాక్షి ఆరోపించారు.

ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి తనకు ప్రాణహాని ఉందని.. భయంగా ఉందని ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ వివిధ టీవీ ఛానళ్లలో బహిరంగంగా చెప్పడంతో పెద్ద దుమారమే రేగింది. ప్రైవేట్ డిటెక్టివ్ అని పిలవబడే కిరణ్ పి. గోసవి వ్యక్తిగత అంగరక్షకుడిగా గుర్తింపు పొందిన సెయిల్ ఈ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్ ఇతరుల అరెస్టుకు సంబంధించిన సంతకం చేసిన అఫిడవిట్ స్టేట్మెంట్ వీడియోలను సెయిల్ విడుదల చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది.

ఎన్సీబీ జాబితా చేసిన 9 మంది సాక్షులలో సెయిల్ ఒకరు. ఏజెన్సీ ద్వారా 10 ఖాళీ కాగితాలపై తనతో సంతకం చేయించారని.. ఇప్పుడు వాంఖడే నుండి తన ప్రాణాలకు భయం ఉందని సెయిల్ ఆరోపిస్తున్నాడు.

అనేక కేసులను ఎదుర్కొంటున్న గోసావి చేసిన ఆరోపణలను ఇప్పుడు సంచలనమయ్యాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి.. మంత్రి నవాబ్ మాలిక్ కూడా ఇటీవల గోసావి సహా ఇతరులు బిజెపితో సంబంధం ఉన్న వ్యక్తులను ఎన్సిబి దాడులలో పాల్గొన్నట్లు ఆరోపించడం సంచలనమైంది. అయితే మంత్రి మాలిక్ ఆరోపణలను బిజెపి -ఎన్సిబి ఖండించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు బహిర్గతం చేస్తామని తెలిపాయి.