షష్ఠి పూర్తి స్పెషల్‌గా సీక్వెల్‌ ప్రకటించనున్నారా?

నందమూరి బాలకృష్ణ ఈనెల 10వ తారీకున తన 60వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు మరియు కొందరు అభిమానుల సమక్షంలో తన షష్టిపూర్తి వేడుకను జరుపుకునేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. ఆ విషయంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక బాలకృష్ణ సినిమాల గురించి కూడా బర్త్‌డే సందర్బంగా ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

చాలా కాలంగా అందరు ఎదురు చూస్తున్న ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌ ప్రకటన బర్త్‌డే సందర్బంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అయితే సినిమా కోసం బాలయ్య కొంత సమయం కావాలని అన్నాడట. అందుకే ఇంత కాలంగా సింగీతం వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఆ సినిమాను ప్రకటించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా సీక్వెల్‌ను రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. బర్త్‌డే సందర్బంగా ఈ సీక్వెల్‌ను ప్రకటించి వచ్చే ఏడాదిలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లానింగ్‌ చేస్తున్నారట.