బిగ్ బాస్ 5: అన్ని లెక్కలు సరిచేసిన నాగ్ -ఎపిసోడ్ -21

అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ లో రాటుదేలిపోయాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. బిగ్ బాస్ హోస్టింగ్ లో ఇది నాగ్ కు మూడో సీజన్. ప్రతీ సీజన్ కు తనను తాను మెరుగుపరుచుకుంటున్న నాగ్ ఈరోజు ఎపిసోడ్ లో తన హోస్టింగ్ స్కిల్స్ ను మరోసారి బయటపెట్టాడు. కంటెస్టెంట్స్ ను ఆటపట్టించడం, వారు చేసే తప్పుల్ని నొప్పించకుండా చెప్పడం, అవసరమైన చోట వారు నొచ్చుకునేలా చేయడం. తన టైమింగ్… ఇలా అన్ని విషయాల్లో నాగ్ సూపర్బ్ గా వ్యవహరించాడు.

ముందుగా ఈ వీక్ ముందు నుండీ నలుగుతోన్న ప్రియా, లహరి, రవి ఇష్యూకు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. ఈ ఇష్యూలో ఎక్కువగా నలిగింది లహరి కాబట్టి ఆమెను రూమ్ కు పిలిచి రవి, ప్రియాల మధ్య జరిగిన సంభాషణను చూపించాడు. దీంతో ప్రియా మనసులో లహరి గురించి ఎక్కించింది రవి అని తేలిపోయింది. లహరి ఈ విషయంలో బయటకు వచ్చి చాలా హుందాగా వ్యవహరించింది.

అలాగే నాగార్జున షణ్ముఖ్, సిరిల మధ్య దూరాన్ని తగ్గించాడు. కెప్టెన్ గా జెస్సిని షణ్ముఖ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని గుర్తుచేశాడు. ఇక సన్నీ అన్ని విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడని గుర్తుచేశాడు. శ్రీరామ్ చంద్ర, హమీదలు కలిసి వస్తారా లేక విడివిడిగా వస్తారా అని పంచ్ వేసాడు. విశ్వ, లోబో, నటరాజ్, శ్వేత.. ఇలా అందరి విషయాల్లో కూడా నాగార్జున తనదైన శైలిలో మోటివేట్ చేయడానికి ప్రయత్నించాడు.

శనివారం ఎపిసోడ్ లో షట్ ది డోర్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారంగా ఇంటి నుండి ఎవరు వెళ్ళిపోవాలి అని కంటెస్టెంట్ అనుకుంటాడో వాళ్ళను డోర్ వెనకాల పెట్టి డోర్ వేసేయాల్సి ఉంటుంది. అయితే కంటెస్టెంట్స్ ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడి తమకు ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ను చెప్పి తప్పించేసుకున్నారు. ఈ వీక్ లో మొత్తం ఐదుగురు మానస్, శ్రీరామ్ చంద్ర, ప్రియా, ప్రియాంక సింగ్, లహరిలు నామినేట్ అవ్వగా నాగార్జున ఇద్దరిని సేఫ్ చేసాడు. ప్రియాంక సింగ్, శ్రీరామ్ చంద్ర ఈరోజు సేవ్ అయ్యారు. మరి మిగిలి ఉన్న ముగ్గురు ప్రియా, లహరి, మానస్ లలో ఎవరు ఎలిమినేషన్ ను ఫేస్ చేస్తారో చూడాలి.