బిగ్ బాస్ 5: అందరికీ టార్గెట్ అయిన జెస్సీ, అందరినీ ఎంటర్టైన్ చేసిన సన్నీ – ఎపిసోడ్ 27

బిగ్ బాస్ లో మరో ఆసక్తికర ఎపిసోడ్ ముగిసింది. ముందు రోజు రాత్రి ఇంకా కంటెస్టెంట్స్ మధ్యన చర్చలు అవ్వలేదు. రాత్రి చాలా సేపు శ్రీరామ్ చంద్ర, హమీదలు గార్డెన్ ఏరియాలో నడుచుకుంటూ మాట్లాడారు. నెక్స్ట్ డే ఉదయం నటరాజ్ మాస్టర్, లోబోతో రవిని ఉద్దేశించి నత్త అని పోల్చడంతో రవి ఆగ్రహం వ్యక్తం చేసాడు. లోబోతో మాట్లాడుతూ మరోసారి నా గురించి ఇలా జంతువులతో పోలుస్తూ మాట్లాడవద్దని అన్నాడు.

కెప్టెన్సీ టాస్క్ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని హౌజ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అన్నది నిర్ణయించమని బిగ్ బాస్ తెలిపారు. ఒక్కో జంట వచ్చి బెస్ట్ ఒకర్ని, వరస్ట్ ఒకర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఆరు కిలోలు తగ్గిన మానస్ ను బెస్ట్ పెర్ఫార్మర్ గా మెజారిటీ హౌజ్ మేట్స్ డిసైడ్ అయ్యారు. వరస్ట్ పెర్ఫార్మర్ విషయంలోనే వచ్చింది సమస్య అంతా.

హౌజ్ మేట్స్ లో ఎక్కువ మంది జెస్సీ వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేసారు. కెప్టెన్ గా విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే జెస్సీ దాని కారణంగా కెప్టెన్సీ రేసులోనుండి తప్పుకోవాల్సి వచ్చింది. జెస్సీ కెప్టెన్సీ రేసు నుండి తప్పుకోవడానికి కారణం లోబో ఫుడ్ తినడం. అయినా కానీ మెజారిటీ ప్రేక్షకులు లోబోను పాయింట్ అవుట్ చేయకపోవడం గమనార్హం. ఎక్కువ ఓట్లు రావడంతో జెస్సీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ బ్యూటీ టాస్క్ జరగ్గా ఐదుగురు అమ్మాయిలు ప్రియా, అన్నీ, ప్రియాంక, సిరి, హమీదలు పెర్ఫర్మ్ చేయగా ఈ టాస్క్ లో ప్రియా గెలిచింది. దాని తర్వాత బిగ్ బాస్ ఒక ఫన్ టాస్క్ ను ఇచ్చారు. శ్రీరామ్ చంద్రను సన్నీ ఇంటర్వ్యూ చేయాలని, మిగిలిన వాళ్ళందరూ ప్రేక్షకులుగా ఉండాలని కోరారు. సన్నీ శ్రీరామ్ చంద్రను చక్కగా ఇంటర్వ్యూ చేసాడు. మధ్యలో కంటెస్టెంట్స్ కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. దాని తర్వాత సన్నీ, లోబో కలిసి ప్రేక్షకులు అందరినీ రోస్ట్ చేసిన ఎపిసోడ్ కూడా చాలా బాగుంది.

ముఖ్యంగా సన్నీ సిరి, శ్వేతా, అన్నీ మాస్టర్ లను ఇమిటేట్ చేసిన విధానం సూపర్బ్. లోబో ప్రియాంకను ఇమిటేట్ చేసాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగానే సాగింది. రేపు, ఎల్లుండి నాగార్జున తన ఎంటర్టైన్మెంట్ తో మరో లెవెల్ కు తీసుకెళ్లడం గ్యారంటీ.