బిగ్ బాస్ 5: ఆసక్తికరంగా సాగుతోన్న కెప్టెన్సీ టాస్క్

బిగ్ బాస్ సీజన్ 5 లో నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ ఎంత ఎమోషనల్ గా సాగిందో చూసాం. దానికి భిన్నంగా ఈసారి కెప్టెన్సీ టాస్క్ ను డిజైన్ చేసారు. నిన్నటిలా ఈసారి కూడా పెద్దగా గొడవలు పడటం, ఫిజికల్ టాస్క్ కాకుండా ఆసక్తికరంగా సాగే టాస్క్ ను డిజైన్ చేసారు. కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుండడమే ఇల్లు మొత్తం లాక్ డౌన్ లో ఉందని తెలిపారు బిగ్ బాస్. ఇంట్లోకి యాక్సెస్ లేదని చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ మొత్తం ఐదు రౌండ్స్ జరుగుతాయి. ఒక్కొక్క రౌండ్ లో ఇద్దరు ఇంటి సభ్యులు పోటీ పడతారు. ఫైనల్ గా ఈ టాస్క్ లలో గెలిచిన ఐదుగురు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు.

ముందుగా ఇప్పటివరకూ అసలు కెప్టెన్సీ టాస్క్ కు రాని షణ్ముఖ్, లోబోలను సెలెక్ట్ చేసి ఏకాభిప్రాయంతో ఫస్ట్ రౌండ్ కు పంపించారు. ఫస్ట్ రౌండ్ లో ఆవు పేడలో ఉన్న ముత్యాలను టబ్ లోకి దిగి తీసి బయట ఉన్న బౌల్ లో కడిగి వేయాల్సి ఉంటుంది. ఎవరెక్కువ క్లీన్ ముత్యాలు తీస్తారో వారు టాస్క్ గెలిచినట్లు. లోబో 70+ ముత్యాలు తీయగా, షణ్ముఖ్ 100+ ముత్యాలు తీసాడు. అయితే షణ్ముఖ్ ముత్యాలు క్లీన్ గా లేవని శ్రీరామ్ చంద్ర, విశ్వ కంప్లైంట్ చేసారు. కానీ సంచాలక్ అయిన సన్నీ షణ్ముఖ్ ను విజేతగా నిలిపారు.

నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ లో తన కోసం త్యాగం చేసిన సిరికు ఈసారి కెప్టెన్సీ టాస్క్ త్యాగం చేసాడు విశ్వ. సెకండ్ రౌండ్ లో రవి, సిరి పోటీ పడ్డారు. స్విమ్మింగ్ పూల్ లో బాటిల్స్ ను ఉంచి గేలంతో వాటిని ఇద్దరూ పైకి తీయాల్సి ఉంటుంది. ఇందులో సిరి, రవి కంటే మూడు బాటిల్స్ ఎక్కువ తీసి విజయం సాధించింది.

ఇక మూడో టాస్క్ మానస్, శ్రీరామ్ చంద్రల మధ్య జరిగింది. రోప్స్ ఎవరు ఎక్కువ సేపు కదుపుతూ ఉంటారో వారు విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో మానస్ కొద్దిసేపటి తర్వాత రోప్స్ ను వదిలేయడంతో శ్రీరామ్ చంద్ర విజయం సాధించాడు. ఈరోజు ఎపిసోడ్ లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ చంద్ర కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మిగిలిన ఇద్దరు ఎవరు అన్నది రేపు తెలుస్తుంది.