బుచ్చిబాబు కు ఏ హీరోతో మైత్రీ కుదురుతుందో..?

సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ వంద కోట్ల సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా వచ్చి ఏడు నెలలు దాటిపోయినా ఇంకా బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ రావడం లేదు.

మామూలుగా అయితే సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి వరుస అవకాశాలు తలుపు తడుతుంటాయి. సక్సెస్ జోష్ లో కొత్త ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ దూసుకుపోతుంటారు. అదీ సుకుమార్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద ఎన్నో ఏళ్లుగా వర్క్ చేసిన వ్యక్తి బుచ్చిబాబు. ‘ఉప్పెన’ వంటి సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా దర్శకుడి పరిస్థితి భిన్నంగా ఉంది.

నిజానికి ‘ఉప్పెన’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బుచ్చిబాబు ప్రయత్నాలు చేశారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సమయంలో ఏర్పడిన సాన్నిహిత్యంతో స్టార్ హీరోకి ఓ స్క్రిప్ట్ కూడా నెరేట్ చేసాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ కథకు తారక్ సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చింది. కాకపోతే ఎన్టీఆర్ ఇప్పటికే కమిటైన ప్రాజెక్ట్స్ వల్ల బుచ్చిబాబు కు ఇప్పట్లో డేట్స్ దొరికే పరిస్థితి లేదు.

అందుకే ఇప్పుడు బుచ్చిబాబు వేరే స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అల్లు అర్జున్ – మహేష్ బాబు వంటి హీరోలను కూడా మీట్ అయినట్లు టాక్. కాకపోతే టాలీవుడ్ టాప్ స్టార్లందరూ బిజీగా ఉండటం ఇప్పుడు బుచ్చిబాబుకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తన తొలి హీరో వైష్ణవ్ తేజ్ తోనే కలిసి ఇంకో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడు మెగా మేనల్లుడు కూడా బిజీగా ఉన్నాడు.

ఏదేమైనా బుచ్చిబాబు రెండో సినిమా ఆలస్యం అవడానికి కారణం స్టార్ హీరోల కోసం ఎదురు చూడటమే అని తెలుస్తోంది. ఫస్ట్ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపులో తన కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ‘ఉప్పెన’ తర్వాత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ వచ్చినా.. బుచ్చిబాబు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే తన రెండో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. మరి మైత్రీ టీమ్ చివరకు బుచ్చిబాబుకు ఏ హీరోని సెట్ చేస్తారో చూడాలి.