సిద్ధూకు పాక్ తో స్నేహం.. అతనితో దేశానికే ముప్పు: మాజీ సీఎం అమరీందర్

పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలే అమరీందర్ రాజీనామాకు కారణమనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధుపై అమరీందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సిద్ధును పంజాబ్ తుదపరి ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రతిపాదిస్తే తాను వ్యతిరేకిస్తానని అన్నారు.

సిద్ధూకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వాలతో స్నేహం ఉందని అన్నారు. సిద్ధు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే.. దేశ భద్రతకే ముప్పు అని అన్నారు. గతంలో తాను కేటాయించిన ఒక్క మంత్రి పదవినే సరిగ్గా చేపట్టలేని వ్యక్తి సిద్ధు అని విమర్శించారు.

ఈనేపథ్యంలో రాష్ట్ర సీఎల్పీ నేతను ఎన్నుకునే బాధ్యతను సోనియా గాంధీకే అప్పజెప్పుతూ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షం తీర్మానించింది. అమరీందర్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడుతూ కూడా తీర్మానం చేసింది. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అజయ్ మాకెన్ అన్నారు.