తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనొచ్చుః కేసీఆర్‌

తెలంగాణ లో కొంత కాలం క్రితం వరకు వ్యవసాయ భూములకు విలువ ఉండేది కాదు. నీటి వనరులు లేక పోవడం వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండేది కాదు. కాని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జల వనరులతో అద్బుతమైన పంటలను పండించే భూములను కలిగి ఉంది. అందుకే వ్యవసాయ భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి అంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యవసాయం అద్బుతంగా ఉందంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు ఏపీలో ఒక్క ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో మూడు నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసేంతగా అభివృద్ది చెందింది అంటూ కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పనుల విషయమై కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మరి కొన్ని ప్రాజెక్ట్‌ ల కోసం ఢిల్లీ వెళ్లబోతున్నట్లుగా కూడా కేసీఆర్‌ పేర్కొన్నారు.