కాషాయ కండువా కప్పుకున్న ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాంఛనం పూర్తయింది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈటలతోపాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోఢ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, ఉస్మానియా జేఏసీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రదాన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ.. ఈటల చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.