బాలయ్య సినిమా టిక్కెట్ల కోసం జైలుకెళ్లాను: గోపీచంద్ మలినేని

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఆ తరువాత సినిమాను బాలకృష్ణతోనే చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. “ఎన్బీకే అంటే ఒక వైబ్రేషన్ .. ఎన్బీకే అంటే ఒక ఎనర్జీ .. ఎన్బీకే అంటే ఒక విస్ఫోటనం. తెలుగు ఇండస్ట్రీలో మాస్ గాడ్ అంటే బాలయ్య బాబునే. ఆయన తరువాత సినిమాను డైరెక్ట్ చేయబోతున్న ఒక డైరెక్టరుగా నేను ఇక్కడికి రాలేదు. మీలో ఒకడిగా .. ఫ్యాన్స్ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను.

బాలయ్య బాబుకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ‘సమరసింహా రెడ్డి’ సినిమా టిక్కెట్ల కోసం రెండు రోజుల పాటు నేను ‘ఒంగోలు’ లాకప్ లో ఉన్నాను. బోయపాటి శ్రీనుగారు మాస్ పల్స్ తెలిసిన ఒక మాస్ డైరెక్టర్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పగలిగే మాస్ గాడ్ బాలకృష్ణగారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ బ్లాక్ బస్టర్ .. ‘లెజెండ్’ అంతకంటే బ్లాక్ బస్టర్ .. ‘అఖండ’ అఖండమైన బ్లాక్ బస్టర్ అవుతుంది. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా డిసెంబర్ 2 కోసమే వెయిట్ చేస్తున్నాను.

ఇక తమన్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. గత నెల రోజులుగా నేను ఎక్కడా కనిపించినా ఆయన ‘అఖండ’ గురించే చెప్పేవాడు. తమన్ ఈ సినిమాను విపరీతంగా ప్రేమించాడు. ‘బోయపాటి ‘అఖండ’ను ఇరగదీశాడు .. నెక్స్ట్ నువ్వే .. చూసుకో’ అనేవాడు. అప్పుడు ఒక అభిమానిగా నేను హ్యాపీగా ఫీలయ్యేవాడిని. ‘అఖండ’ ఫస్టులుక్ .. టీజర్ .. ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ కి కావలసిన అంశాలు బీభత్సంగా ఉన్నాయనిపించింది. శ్రీకాంత్ గారిని చూస్తుంటే ఒక వైబ్ కనిపించింది. ఫస్టు లాక్ డౌన్ తరువాత ‘క్రాక్’ హిట్ అయింది. సెకండ్ లాక్ డౌన్ తరువాత ‘అఖండ’ అఖండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.