#PSPK28 ఇంట్రెస్టింగ్‌ ప్రకటన చేసిన హరీష్‌ శంకర్

నేటితో పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ గబ్బర్‌ సింగ్‌ విడుదల అయ్యి 8 ఏళ్లు అయ్యింది. ఈ సందర్బంగా పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ మళ్లీ ఇన్నాళ్లకు పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాకు రెడీ అయ్యాడు. పవన్‌ 28 చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. కొన్ని నెలల క్రితమే ఈ ప్రకటన వచ్చింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ప్రకటనను హరీష్‌ శంకర్‌ చేశాడు.

గబ్బర్‌ సింగ్‌ 8 ఏళ్లు అయిన సందర్బంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఈ శుభ సందర్బంలో ఒక మంచి విషయాన్ని షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని షేర్‌ చేసేందుకు ఇంత కంటే మంచి సమయం ఉండక పోవచ్చు అంటూ పవన్‌ కళ్యాణ్‌ తో తాను చేయబోతున్న సినిమాకు మళ్లీ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా హరీష్‌ శంకర్‌ ప్రకటించాడు.

వీరిద్దరి కాంబోలో గబ్బర్‌ సింగ్‌ మరియు డీజే చిత్రాలు వచ్చాయి. మరోసారి ఈ కాంబో పవన్‌ 28 చిత్రానికి వర్క్‌ చేయబోతున్నారు. మేము మళ్లీ వస్తున్నాము అంటూ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ఉన్న ఫొటోను హరీష్‌ శంకర్‌ పోస్ట్‌ చేశాడు. చివర్లో ఇప్పుడే మొదలైంది.. అంటూ హరీష్‌ శంకర్‌ పవన్‌ 28 పై అంచనాలు పెంచేలా ట్వీట్‌ చేశాడు.

పవన్‌ ప్రస్తుతం చేస్తున్న వకీల్‌ సాబ్‌ మరియు క్రిష్‌ మూవీల తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఈ ఏడాది చివరికి గబ్బర్‌ సింగ్‌ కాంబో షురూ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ చివరికి లేదంటే దసరాకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్నారు.