చెంప పగిలింది.! కేఏ పాల్ ముఖ్యమంత్రి అయిపోతారా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భుజంలో కోడి కత్తి గుచ్చుకుంది.. ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద చెప్పుతో దాడి జరిగింది.. ఆయనా ముఖ్యమంత్రి అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమయ్యింది.. ఆమె కూడా ముఖ్యమంత్రి అయ్యారు.

ఆగండాగండీ.. ఇవన్నీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు అందిస్తున్న సమయంలోనే జరిగాయి. దటీజ్ ప్రశాంత్ కిషోర్. ఆయా అంశాలు రాజకీయాల్లో అప్పట్లో ఎంత చర్చనీయాంశాలుగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలంగాణలో ఓ సీఎం అభ్యర్థి మీద కూడా దాడి జరిగింది. చెంప పగలిగింది. ఆ సీఎం అభ్యర్థి ఎవరో తెలుసా.? ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్. మామూలుగా అయితే కేఏ పాల్ నిన్న మొన్నటిదాకా రాజకీయాల్లో ఓ కమెడియన్ అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. సీన్ మారిందా.? మార్చేశారా.? మార్చేసే వుంటార్లెండి.! ఇప్పుడు రాజకీయమే అలా తగలడింది.

కేఏ పాల్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులెవరైనా వున్నారా.? అసలు ఆయనైనా మాట మీద నిలబడతాడా.? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలేమీ కావు. జస్ట్ అలా కామెడీ స్కిట్లు చేస్తుంటాడంతే కేఏ పాల్ రాజకీయాల్లో. కానీ, రాత్రికి రాత్రి ఆయన స్టార్ అయిపోయాడు.. కాదు కాదు, ఆయన్ని పొలిటికల్ స్టార్‌గా మార్చేశారు.

అనూహ్యంగా రాజకీయ చర్చలన్నీ కేఏ పాల్ మీద దాడి వైపు మళ్ళాయి. దాంతో, మిగతా కీలకమైన రాజకీయ అంశాలు అటకెక్కాయ్. అదండీ సంగతి. మీడియా తలచుకుంటే ఏదైనా చేయగలదు. ఎలాగూ ఆ మీడియా రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే నడుస్తుందనుకోండి.. అది వేరే సంగతి.