బ్రదర్ ఆఫ్ రానాకు నో చెప్పిన బేబమ్మ

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా రెండు మూడు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఈయన ఎంట్రీ ఎప్పుడో ఉండాల్సినా కూడా మద్యలో చిన్న వివాదం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు దర్శకుడు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సురేష్ బాబు నిర్మించబోతున్న ఈ సినిమా కోసం తేజ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టారట. ఈ సినిమా కోసం దర్శకుడు తేజ ఉప్పెన బేబమ్మ కృతి శెట్టిని సంప్రదించగా నో చెప్పిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉప్పెన సినిమా తో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి ఇప్పటికే తెలుగులో మూడు నాలుగు సినిమా లను కమిట్ అవ్వడంతో పాటు తమిళంలో కూడా ఒకటి రెండు సినిమా లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత బిజీగా ఉండటం వల్లే రానా బ్రదర్ అభిరామ్ కు జోడీగా నటించేందుకు కృతి నో చెప్పి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం కృతి శెట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక పెద్ద కుటుంబంకు చెందిన హీరోకు ఎలా నో చెబుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృతికి అభిరామ్ తో వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేక పోవడం వల్లే నో చెప్పి ఉంటుందేమో అంటున్నారు.

మొత్తానికి అభిరామ్ తో కృతి శెట్టి నటించేందుకు ఏవో కారణాలు చెప్పి నో చెప్పిందనే వార్తలు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కృతి శెట్టి నో చెప్పడంతో ఆ స్థానంలో కొత్తమ్మాయిని ఎంపిక చేసేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడు. పరిస్థితులు అన్ని కూడా కుదుట పడితే ఈ ఏడాది చివరి వరకు బ్రదర్ ఆఫ్ రానా అయిన దగ్గుబాటి అభిరామ్ సినిమా పట్టాలెక్కి వచ్చే ఏడాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అభిరామ్.. తేజల మూవీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.