మహాసముద్రం.. ఇకపై పుకార్లు ఉండవు

మహాసముద్రం.. అజయ్ భూపతి దర్శకత్వంలో రావాల్సిన సినిమా. దాదాపు 7-8 నెలలుగా ఈ సినిమాపై వినిపిస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక దశలో ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లూ గాసిప్స్ లో నలిగిన ఈ సినిమా ఇప్పుడు రియాలిటీ లోకి వచ్చింది. అవును.. మహాసముద్రం సినిమాను అధికారికంగా ప్రకటించారు.

శర్వానంద్ హీరోగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా మహాసముద్రం సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు. ఇంటెన్స్ లవ్-యాక్షన్ డ్రామాగా తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రాబోతోంది.

ఈ ప్రాజెక్టులో ముందుగా నాగచైతన్యను హీరోగా అనుకున్నారు. చైతూ-సమంత కలిసి ఈ ప్రాజెక్టు చేస్తారని అనుకున్నారు. తర్వాత రవితేజ వద్దకు కూడా వెళ్లింది. ఫైనల్ గా శర్వానంద్ దగ్గరకొచ్చి ఆగింది.

ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఇకపై సినిమాకు సంబంధించి ప్రతి వారం ఓ అప్ డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇదొక మల్టీస్టారర్ మూవీ కాబట్టి, సెకెండ్ హీరో ఎవరనే విషయాన్ని వచ్చే వారం ప్రకటిస్తారు. రాశిఖన్నాను ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తారు.