రాహుల్ ని కలిశాక విబేధాలు మర్చిపోయా.. కలిసి పని చేస్తాం: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన చెప్పిన సూచనలతో గతంలో తాను చెప్పిన విషయాలు మర్చిపోయాను. తెలంగాణలో కలసికట్టుగా పని చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. మా మధ్య ఎలాంటి విబేధాలూ ఉండవు. ఎలా పని చేస్తామో మీరే చూస్తారు. ప్రజల సమస్యలను టీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు’.

‘ప్రజల పక్షాన ఎలా నిలబడాలి.. ఎలా పోరాడాలి అనే విషయాలపై రాహుల్ చర్చించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఆ విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం పని చేస్తాం. గతంలో మామధ్య ఉన్న విబేధాలను ఇప్పుడు మర్చిపోయా. రాహుల్ గాంధీతో కలిసి కుటుంబసభ్యులం ఫొటో దిగడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.