పది పరీక్షల రద్దు చేయాలంటూ సీఎం జగన్ కు లోకేశ్ లేఖ

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. విద్యార్థులను పాస్ చేయాలంటూ సీఎం జగన్‍కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మరో మూడు వారాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్షలు రద్దే చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని కోరారు. దేశంలోని 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలు రద్దు చేసాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు. గతేడాది 5వేల కేసులున్నప్పుడే పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదమని అన్నారు. హైకోర్టు, ప్రతిపక్ష నాయకుల ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా మానవత్వంతో ఆలోచించి పరీక్షల్ని రద్దు చేయాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమయాన్ని వృథా చేయొద్దని, పరీక్షల రద్దు చేయాలని కోరారు.