బీ కేర్ ఫుల్.. వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్

వైసీపీ నేతల అరాచకాలకు భయపడి పారిపోయే వాళ్లం కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 27 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపారని.. తమ ఓపికను పరీక్షించొద్దని, బీ కేర్ ఫుల్ అని హెచ్చరించారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో గురువారం హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలను లోకేశ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వాహనంతో ఢీకొట్టించి దారుణంగా హతమార్చారని మండిపడ్డారు. ‘టీడీపీ కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే మేం వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? మిమ్మలిన వదిలిపెట్టం. టీడీపీ ఎక్కడికీ పోదు. మీకు భయపడి పారిపోయేవాళ్లం కాదు. అభివృద్ధి చేయడం చేతకాకే మా నేతలపై దాడులు చేస్తున్నారు. మా ఓపికను పరీక్షించొద్దు. బీ కేర్ ఫుల్.. సమయం వస్తుంది. అప్పడు అందరికీ గుణపాఠం చెబుతా’ అని లోకేశ్ పేర్కొన్నారు.