హారర్ కామెడీ ప్రాంఛైజీ స్ట్రోక్ కి సైలెంట్ అయిపోయిన డైరెక్టర్..!

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. వెండితెరపై దర్శకుడి అవతారమెత్తాడు. తొలి ప్రయత్నంగా ‘జీనియస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత హోమ్ బ్యానర్ లో ‘రాజు గారి గది’ ప్రాంఛైజీలో హారర్ కామెడీ సినిమాలు రూపొందించారు ఓంకార్.

‘రాజు గారి గది’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. దీనికి సీక్వెల్ గా ‘రాజు గారి గది 2’ చిత్రాన్ని తీసాడు ఓంకార్. ‘కింగ్’ అక్కినేని నాగార్జున – సమంత వంటి స్టార్స్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలో ప్రాంఛైజీని కొనసాగిస్తూ మూడో చిత్రాన్ని రూపొందించారు.

ఓంకార్ తన సోదరుడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి ‘రాజుగారి గది 3’ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమా ఇచ్చిన స్ట్రోక్ కి దర్శకుడు సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీదకు ఫోకస్ షిప్ట్ చేశాడు.

‘స్టార్ మా’ ఛానల్ తో ఓంకార్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ‘ఇస్మార్ట్ జోడీ 2’ షో మీదనే దృష్టి పెట్టారని తెలుస్తోంది. సీజన్-1 సక్సెస్ అవడంతో ఇప్పుడు రెండో సీజన్ పైనా ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ మంచి టీఆర్పీ తెచ్చుకున్నాయి.

‘ఇస్మార్ట్ జోడీ 2’ షో కంప్లీట్ అయ్యాక ఓంకార్ మళ్ళీ ‘రాజుగారి గది’ ఫ్రాంఛైజ్ గురించి ఆలోచించనున్నారట. హిట్ ఫార్ములాను రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సిరీస్ లో నాలుగో మూవీ చేయడానికి దర్శకుడు సన్నాహకాలు చేస్తున్నాడట. గతంలో ఇందులో మాస్ మహారాజా రవితేజ నటిస్తారని వార్తలు వినిపించాయి కానీ.. అది సెట్ కాలేదు. మరి ‘రాజు గారి గది 4’ లోకి ఓంకార్ ఎవరిని తీసుకొస్తారో చూడాలి.