వైఎస్ జగన్‌ని పట్టాభి తిట్టిన తిట్టులో అంత ‘బూతు’ వుందా.?

టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి ‘రియాక్షన్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా గట్టిగా వచ్చింది. ‘అలా తిడితే, దాడులు జరగవా.?’ అని అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటి.? దాడులు చేసే హక్కు వైసీపీకి ఎవరిచ్చారు.? అధికారంలో వుండీ, దాడుల్ని ప్రోత్సహించడమేంటి.?

సరే, పట్టాభి అంతలా ముఖ్యమంత్రిపై దూషణలకు దిగడం అస్సలేమాత్రం సబబు కాదు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, పట్టాభి తిట్టిన ఓ తిట్టు ముఖ్యమంత్రిని ఎందుకంత ఆందోళనకు గురిచేసింది.? ఆ తిట్టులోని అర్థమేంటి.? ఈ విషయమై పెద్ద రీసెర్చ్ జరుగుతోంది.

నిజానికి, అది తిట్టు కాదట.. ఓ పలకరింపు మాత్రమేనట. అలాగని నెటిజన్లు శోధించి మరీ అందులోని అర్థాన్ని బయటపెడుతున్నారు. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజే అది బూతు తిట్టు కాదని చెప్పేశారు. ఆయన రెబల్ ఎంపీ కదా.. అలాగే చెబుతారని అనుకోవచ్చు.. కానీ, అసలు అర్థమైతే తిట్టు కాదు.

కానీ, దండయాత్రల అనంతరం ఓ వర్గం పాలకులు ‘ఆ మాటకి’ అర్థాన్ని మార్చేసి, బూతుగా ప్రచారంలోకి తీసుకొచ్చారట. అసలు ఈ హిస్టరీ అంతా ఎవడిక్కావాలి.? అన్నది వేరే చర్చ. ముఖ్యమంత్రి మీద టీడీపీ నేత చేసిన విమర్శల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ధ్వంసమైంది.. వ్యాఖ్యలు చేసిన పట్టాభి కూడా అరెస్టయ్యారు.

ఇంతకీ, ఇదే తిట్టు.. అచ్చ తెలుగులో.. అత్యంత జుగుప్సాకరంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద టీడీపీకి చెందిన పలువురు నేతలు ప్రయోగించారు. కాస్త ఇదే అర్థం వచ్చేలా తమ్మినేని వారు కూడా ఓ ప్రవచనం చెప్పారు కొన్నాళ్ళ క్రితం. జోగి రమేష్ అయితే, అసెంబ్లీ సాక్షిగా ‘లుచ్ఛా వెధవ’ అనేశారు. మంత్రి కొడాలి నాని, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంగతి సరే సరి. మరి, వీళ్ళందరినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడంలేదు.?

అధికార పార్టీ నుంచి వచ్చే తిట్లను అందరూ ‘ప్రవచనాల్లా’ స్వీకరించాలి. అదే, అధికార పార్టీ మీదకు ఎవరైనా అవే ప్రవచనాల్ని సంధిస్తే.. అప్పుడు మాత్రమే అవి బూతులుగా పిలవబడ్తాయ్. అదండీ సంగతి.